Makara Sankranti 2024: సంక్రాంతి పండుగ రోజు ఎటువంటి పనులు చేయాలి? ఎటువంటి పనులు చేయకూడదో తెలుసా?
ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా సంక్రాంతి సంబరాలకు సంబంధించిన హంగామా మొదలైంది. కొత్త ఏడాది వచ్చే తొలి పండుగే ఈ సంక్రాంతి. అంతే
- By Nakshatra Published Date - 04:00 PM, Thu - 11 January 24
ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా సంక్రాంతి సంబరాలకు సంబంధించిన హంగామా మొదలైంది. కొత్త ఏడాది వచ్చే తొలి పండుగే ఈ సంక్రాంతి. అంతేకాకుండా తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన అతి పెద్ద పండుగ ఇది. భోగి మంటలు, అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, డూడూ బసవన్నలు, హరిదాసుల సందడి, గాలి పటాలు ఎగురవేయడం, ఘుమఘుమలాడే పిండి వంటలతో సంక్రాంతి పండుగ సంబరాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. ఇక ఈ సంక్రాంతి పండుగను మూడు రోజులపాటు అట్టహాసంగా జరుపుకుంటారు. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ సంక్రాంతి పండుగ రోజు తెలిసి చేయకుండా కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు.
మరి సంక్రాంతి రోజు ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ ఏడాది జనవరి 15న సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఉదయం తెల్లవారు జామునే నిద్రలేచి నదీ స్నానం ఆచరించాలి. పారే నీటిలో మాత్రమే స్నానం చేయాలి. ఒకవేళ అలా కుదరని పక్షంలో గతంలో నదీ స్నానానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన గంగాజలం మీరు స్నానం చేసే నీటిలో కలుపుకుని చేయాలి. సూర్య దేవుడికి ప్రత్యేకంగా పూజ పూజ చేయాలి. మకర సంక్రాంతి రోజు సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల అంతా మంచే జరుగుతుంది. అలాగే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.
కొంతమంది ఈరోజు సూర్యుడికి నీళ్ళు, ఎర్రని పువ్వులు, గోధుమలు, నువ్వులు, అక్షింతలు, తమలపాకులు సమర్పిస్తారు. అర్ఘ్యం సమర్పించేటప్పుడు సూర్య మంత్రం, గాయత్రీ మంత్రం జపించాలి. నీటి ప్రవాహంలో సూర్యభగవానుడిని చూడటం చాలా పవిత్రంగా భావిస్తారు. తర్వాత సూర్య భగవానుడికి ధూపదీపాలు లేదా నెయ్యి దీపాన్ని చూపించి మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి. భోగం సమర్పించిన తర్వాత చేసిన పాపాలకు క్షమాపణ అడగాలి. సంక్రాంతి పండుగ రోజు ఇంటికి ఎవరైన వస్తే వారిని ఖాళీ చేతులతో తిరిగి పంపించకూడదు. ఆ రోజు దానం చేయడం చాలా మంచిది. మీ శక్తికి తగినట్టుగా ఏదైనా వస్తువులు, దుస్తులు, ఆహార పదార్థాలు దానం చేస్తే మంచి జరుగుతుంది. నల్ల నువ్వులు దానం చేయడం వల్ల శని దోషాల నుంచి విముక్తి కలుగుతుంది.
ఇంటి దగ్గరకు వచ్చే బసవన్నలకు ఆహారం అందించాలి. మకర సంక్రాంతి రోజుల చేసే నువ్వుల లడ్డూ, కిచిడీ చాలా ప్రత్యేకమైనది. నిరుపేదలకు నువ్వులు, బెల్లం, కిచిడీ దానం చేయాలి.ఎటువంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. సంక్రాంతి రోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం తినడం మానుకోవాలి. మద్యం సేవించకూడదు. ఆకలి అంటూ ఇంటికి వచ్చిన ఏ పేదవాడిని ఖాళీ చేతులతో పంపించకూడదు. మకర సంక్రాంతి రోజున స్నానం చేయకుండా ఆహారం తీసుకోకూడదు.
Related News
TSRTC: సంక్రాంతికి 2.5 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం
తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కీమ్ మహాలక్ష్మి. ఇందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు.