Ayodhya : మీరు తప్పక తెలుసుకోవాల్సిన అయోధ్య రామాలయ విశేషాలు
- By Sudheer Published Date - 05:48 PM, Sun - 21 January 24
దేశమంతా శ్రీరాముడి నామమే జపిస్తోంది. రేపు అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠను పురస్కరించుకుని అనేక చోట్ల ఈ వేడుకలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాలుగా గుడారంలో నివసించిన రామ్లల్లా..మరికొద్ది గంటల్లో ఓ నూతన ఆలయంలోకి అడుగుపెట్టబోతున్నాడు..ఈ మహా కార్యాన్ని చూసేందుకు యావత్ రామ భక్తులు , ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ వేడుకని భారతదేశ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే.. భారత్లోని రామ భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారాలను ఏర్పాటు చేశారు.
ఇక ఈ అయోధ్య రామమందిర విశేషాలు , అద్భుతాలు ఎంత చెప్పిన..ఎన్ని చెప్పిన తక్కువే..ఆలయంలో ప్రతిదీ ఓ మహా అద్భుతమే. అసలు రామాలయ నిర్మాణంలో ఇనుము.. సిమెంట్ అనేది వాడకుండా కట్టారని మీరు నమ్మగలరా..? ఈరోజుల్లో ఇనుము.. సిమెంట్ లేకుండా ఎలా కట్టరనే ప్రశ్న తలెత్తుతుంది. కానీ ఈ ఆలయంలో ఆ రెండు వాడలేదు. ప్రత్యేకమైన రాళ్లతో నిర్మించారు. దీని నిర్మాణంలో ఉపయోగించే ప్రతి రాయికి ఒక గాడిని తయారు చేసి.. అదే చోట మరో రాయి అమరిపోయేలా ఆ గాడిలో అమర్చారు. ఈ విధంగా రామ మందిరంలో ఉపయోగించే రాళ్లన్నీ సిమెంట్ లేకుండా ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యాయి. ఆలయ ప్రధాన నిర్మాణం రాజస్థాన్లోని భరత్పూర్లోని బన్సీ పహర్పూర్ నుండి తెచ్చిన గులాబీ రాయితో నిర్మితమయ్యింది. ఈ రాళ్లతోనే ఆలయం అంతటినీ నిర్మించారు. ఎక్కడా కూడా ఇనుము, సిమెంటు ఉపయోగించలేదు. ఆలయ నిర్మాణ పునాదిలో కూడా ఇనుము, సిమెంట్, ఉక్కు నేడు కూడా ఉపయోగించలేదు. అలాగే మందిరం కోసం రాజస్తాన్ నుంచి రాళ్లు.. హైదరాబాద్ నుంచి తలుపులు… విదేశాల నుంచి మట్టి, నీళ్లు తీసుకొచ్చారు.
ఇక ఆలయ వివరాలు చూస్తే..
- మొత్తం ఏరియా: 70 ఎకరాలు (70శాతం గ్రీన్ ఏరియా) ఆలయ నిర్మాణం జరిగింది.
- టెంపుల్ ఏరియా: 2.77 ఎకరాలు
- నిర్మాణ విస్తీర్ణం: 57,400 చదరపు అడుగులు
- ఆలయం పొడవు: 380 అడుగులు
- ఆలయం వెడల్పు: 235 అడుగులు
- ఆలయ శిఖరం ఎత్తు: 161 అడుగులు
- నిర్మాణ శైలి: నగార స్టైల్
- ఆర్కిటెక్చరల్ హైలైట్స్: 3 అంతస్తులు392 స్తంభాలు44 తలుపులు
- శంకుస్థాపన జరిగింది: 5.08.2020
- మందిరం నిర్మాణం సంపూర్ణమయ్యేది (అంచనా): 2026
- గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఎత్తు: 51 అంగుళాలు
- భక్తులకు దర్శనం ఇచ్చే దూరం: 35 అడుగులు
- రామ మందిరానికి అయిన ఖర్చు: 400 కోట్లుకాంప్లెక్స్ నిర్మాణానికి
- అయ్యే ఖర్చు అంచనా: 1,800 కోట్లు జూన్, 2022 నాటికి ట్రస్ట్
- వచ్చిన విరాళాలు: 3,400 కోట్లు
500 ఏళ్లు గా తలపాగా ధరించని వారు..ఇప్పుడు ధరించారు
We’re now on WhatsApp. Click to Join.
అయోధ్య రామమందిరం కల సాకారమవుతున్న వేళ ఇటీవల ఓ మహిళ ఏళ్లుగా పాటిస్తున్న మౌనవ్రతాన్ని విధించింది. ఇక యూపీలోని సరైరసి గ్రామానికి చెందిన ‘సూర్యవంశీ ఠాకూర్’ వర్గం కూడా ఇలాంటి శపథమే చేసింది. రామాలయ నిర్మాణం జరిగే వరకు తలపాగా ధరించొద్దని ఈ వర్గం పూర్వీకులు దాదాపు 500 ఏళ్ల క్రితం భీష్మించుకున్నారట. ఇక ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ జరగనుండటంతో ప్రస్తుతం ఉన్న ఆ వర్గీయులు నిన్న దీక్ష విరమించి తలపాగా ధరించారు.
బలరాముడికి కానుకలు చూస్తే..
బాలరాముడికి దేశ నలుమూలల నుంచి కానుకలు అందుతున్నాయి. ఈ జాబితాలో 500 కిలోల బరువు ఉండే భారీ డోలు, విల్లు, 2100 కిలోల భారీ గంట, 1,100 కిలోల దీపం, బంగారు పాదుకలు, 108 అడుగుల అగరబత్తి ఉన్నాయి. అలాగే సీతాదేవి పుట్టినిల్లుగా నేపాలీలు పేర్కొనే జనక్పూర్ నుంచి ఏకంగా 3వేలకుపైగా కానుకలు వచ్చాయి.
హైదరాబాద్ నుంచి అయోధ్యకు 1265 కేజీల లడ్డు
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక సందర్భంగా హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారి 1265 కిలోల భారీ లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఎన్ నాగభూషణం రెడ్డి అనే క్యాటరింగ్ వ్యాపారి ఈ లడ్డూని అయోధ్యలోని కరసేవకపురం ప్రాంతానికి తీసుకెళ్లారు. శ్రీరాముడు తన కుటుంబాన్ని, వ్యాపారాన్ని ఆశీర్వదించారని, గత 20 ఏళ్లుగా ప్రతిరోజూ కేజీ లడ్డూని స్వామికి సమర్పిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుత విగ్రహాన్ని ఏం చేస్తారంటే..!
అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్న నేపథ్యంలో ప్రస్తుత విగ్రహాన్ని ఏం చేస్తారనే అనుమానాలు అందరిలో నెలకొన్నాయి. ఈ విగ్రహాన్ని కూడా ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు. విగ్రహం చిన్నది కావడంతో కొత్త విగ్రహాన్ని రూపొందించారు. కొత్తది మూల విరాట్గా గా, ప్రస్తుత విగ్రహం ఉత్సవమూర్తిగా సేవలు అందుకుంటాయి. 30 అడుగుల దూరం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక రాముడి దర్శనానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. ఎంతమంది వచ్చినా ఉచిత దర్శనం కల్పించనుంది. ఎలాంటి భేదాలు లేకుండా అందరికీ ఒకే తరహా దర్శనానికి ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనంతో పాటు ప్రసాదం కూడా ఉచితంగానే అందించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఉచిత వసతి కల్పనపైనా ఆలోచనలు చేస్తున్నారు.
ప్రాణ ప్రతిష్ఠకు 14 జంటలు
అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దేశంలోని 14 జంటలు కర్తలుగా వ్యవహరించనున్నాయి. రాజస్థాన్, అసోం, జైపుర్, పంజాబ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, హరియాణా రాష్ట్రాల నుంచి ఉన్నారు. నిన్న పుష్పాదివాస్ కార్యక్రమం నిర్వహించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక విమానాల్లో వీటిని తీసుకొచ్చారు. ఇలా అయోధ్య రామ మందిర విశేషాలు ఎన్ని చెప్పిన తక్కువే.
Read Also : Ayodya : రామ మందిర ఉంగరాల డిమాండ్ మాములుగా లేదు
Related News
Lok Sabha Polls 2024: తమిళిసై మత ప్రచారం.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేయడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళిసై పై బీఆర్ఎస్ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీ, తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసింది.