అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!
ఏప్రిల్ 19 ఉదయం 10:49 గంటల నుండి ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ 20 ఉదయం 7:49 గంటల వరకు ఉంటుంది. ఈ పవిత్ర సమయంలో కొనుగోళ్లు చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలిగి సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వసిస్తారు.
- Author : Gopi
Date : 17-04-2026 - 1:51 IST
Published By : Hashtagu Telugu Desk
Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ పర్వదినం దానధర్మాలకు, కొనుగోళ్లకు అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఈ రోజున బంగారం కొనడం చాలా మంచిదని ప్రజల నమ్మకం. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్ష తృతీయ తిథి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజును ‘అబుజ్ ముహూర్తం’ అని కూడా అంటారు. అంటే ఈ రోజున ఎలాంటి శుభకార్యానికైనా ప్రత్యేకంగా ముహూర్తాలు చూడాల్సిన అవసరం లేదు. అయితే 2026లో అక్షయ తృతీయ ఏప్రిల్ 19నా లేదా 20నా అనే విషయంలో ప్రజల్లో కొంత గందరగోళం ఉంది. దాని గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
అక్షయ తృతీయ ఎప్పుడు?
వైశాఖ శుక్ల పక్ష తృతీయ తిథి 19 ఏప్రిల్ 2026 ఆదివారం ఉదయం 10 గంటల 49 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు 20 ఏప్రిల్ 2026, సోమవారం ఉదయం 7 గంటల 27 నిమిషాలకు ముగుస్తుంది. సాధారణంగా ఉదయ తిథిని ప్రామాణికంగా తీసుకుంటే ఏప్రిల్ 20న పండుగ జరుపుకోవాలి. కానీ అక్షయ తృతీయ కొనుగోళ్లకు, పూజలకు అవసరమైన ప్రధాన సమయం ఏప్రిల్ 19నే ఎక్కువగా లభిస్తోంది. అందువల్ల ఈ పండుగను ఏప్రిల్ 19నే జరుపుకోనున్నారు.
Also Read: ఫ్రీజర్ కాయిన్ ట్రిక్.. ప్రమాదాన్ని ముందే పసిగడుతుంది!
అక్షయ తృతీయ ప్రాముఖ్యత
అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి వస్తువులు కొనడం శుభప్రదంగా భావిస్తారు. పురాణాల ప్రకారం.. ఈ రోజున శ్రీమహావిష్ణువు ‘హయగ్రీవ’ అవతారం ఆవిర్భవించింది. అలాగే కృతయుగం ముగిసి త్రేతాయుగం ప్రారంభమైన రోజుగా కూడా దీనిని పరిగణిస్తారు. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, దానధర్మాలు చేయడం వల్ల అక్షయమైన (తరిగిపోని) పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.
శుభ ముహూర్తం
పూజకు శుభ సమయం: ఏప్రిల్ 19 ఉదయం 10:49 గంటల నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు.
బంగారం కొనుగోలుకు సమయం: ఏప్రిల్ 19 ఉదయం 10:49 గంటల నుండి ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ 20 ఉదయం 7:49 గంటల వరకు ఉంటుంది. ఈ పవిత్ర సమయంలో కొనుగోళ్లు చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలిగి సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వసిస్తారు.