Salman Khan : సల్మాన్ఖాన్ కారుపై కాల్పులకు స్కెచ్.. పాక్ నుంచి తుపాకులు!
ఈ ఏడాది ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రాలో ఉన్న బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన ఘటన కలకలం రేపింది.
- By Pasha Published Date - 10:48 AM, Sat - 1 June 24

Salman Khan : ఈ ఏడాది ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రాలో ఉన్న బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన ఘటన కలకలం రేపింది. దీనిపై దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు కీలక వివరాలను తెలుసుకోగలిగారు. ఇదంతా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే అని నిర్ధారించారు. పాకిస్తాన్ నుంచి అందే ఏకే 47, ఎం 16 తుపాకులతో మహారాష్ట్రలోని పన్వెల్ వద్ద సల్మాన్ఖాన్ కారుపై ఎటాక్ చేయాలని ఆ గ్యాంగ్ భావించిందని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, కెనడాలో ఉంటున్న అతడి బంధువు అన్మోల్ బిష్ణోయ్, సహచరుడు గోల్డీ బ్రార్తో కలిసి సల్మాన్ ఖాన్ కారుపై దాడికి దాదాపు ఆరు నెలల క్రితమే స్కెచ్ గీశారని విచారణలో వెల్లడైంది. ఒకవేళ సల్మాన్ ఖాన్ కారుపై దాడికి అవకాశం దొరకకపోతే.. ఆయన ఫామ్ హౌస్లో ఉన్న టైంలో దాడి చేయాలని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన అనుచరులకు సూచించాడని విచారణలో వెలుగుచూసింది.
We’re now on WhatsApp. Click to Join
ఇక ఈ ఏడాది ఏప్రిల్లో సల్మాన్(Salman Khan) ఇంటిపై కాల్పులు జరిపిన వ్యవహారంలో ఇప్పటికే నలుగురిని నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు విక్కీ గుప్తా, సాగర్ పాల్లను గుజరాత్లో అరెస్టు చేయగా.. అనూజ్ థాపన్, మరొక వ్యక్తిని పంజాబ్లో ఏప్రిల్ 26న అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసు కస్టడీలో ఉండగా అనూజ్ థాపన్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. మే 1న పోలీసు లాకప్లో అనూజ్ థాపన్ చనిపోయిన ఘటనపై అతడి తల్లి రీటా దేవి అనుమానం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆరోపణతో ఆమె మే 3న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడి మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని రీటా దేవి డిమాండ్ చేశారు. దీనిపై పోలీసుల వాదన మరోలా ఉంది. లాకప్లో థాపన్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణకు శ్రీమతి దేవి పిటిషన్ను కోరింది.