Sandhya Theatre Incident : శ్రీ తేజ్ కుటుంబానికి రూ.2కోట్ల సాయం: అల్లు అరవింద్
బాలుడు శ్రీతేజ్ తండ్రికి ధైర్యం చెప్పిన నిర్మాతలు.. అనంతరం టీమ్ మొత్తం కలిసి రూ.2 కోట్లు భారీ ఆర్థికసాయం ప్రకటించింది.
- By Latha Suma Published Date - 03:19 PM, Wed - 25 December 24

Sandhya Theatre Incident : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నబాలుడు శ్రీతేజ్ను నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజ్లు పరామర్శించారు. అనంతరం అతడి కుటుంబానికి రూ.2 కోట్ల సాయం చేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. ఇక బాలుడు శ్రీతేజ్ తండ్రికి ధైర్యం చెప్పిన నిర్మాతలు.. అనంతరం టీమ్ మొత్తం కలిసి రూ.2 కోట్లు భారీ ఆర్థికసాయం ప్రకటించింది. హీరో అల్లు అర్జున్ తరపున రూ.1 కోటి, పుష్ప2 దర్శకుడు సుకుమార్, నిర్మాతలు చెరో రూ.50 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
శ్రీతేజ్ త్వరలోనే కోలుకుని ఆరోగ్యంగా మనముందు తిరుగుతాడని ఆశిస్తున్నానని అల్లు అరవింద్ అన్నారు. కాగా, పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించిన విషయం విధితమే. అయితే రేవతి కుటుంబ సభ్యులను ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రూ.25లక్షలు ఆర్థిక సహాయం చేశారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శించారు.
ఇక, దిల్ రాజు మంగళవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి కుటుంబసభ్యులు, డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నవిషయం తెలిసిందే. అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం. రేవతి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలన్నారు. రేవతి భర్త భాస్కర్కు సినీ ఇండస్ట్రీలో శాశ్వత ఉద్యోగం కల్పిస్తామన్నారు. సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్డీసీ ఛైర్మన్గా బాధ్యత తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాన్ని కాపాడుకోవడమే అందరి లక్ష్యమని దిల్ రాజు అన్నారు.
Read Also: Health Benefits Of Oil: మెరిసిపోయే చర్మం కావాలా.. అయితే ఈ ఆయిల్ను ట్రై చేయండి!