IT Employees : ఐటీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్
IT Employees : 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి మారింది. అమెరికాలో ఆర్థిక సంక్షోభం, పశ్చిమాసియా దేశాల్లో ఆర్థిక అనిశ్చితి కారణంగా ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం పడింది
- By Sudheer Published Date - 01:42 PM, Mon - 6 January 25

ఐటీ రంగం (IT sector) దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. కరోనా సమయంలోనూ ఐటీ రంగం ఇతర రంగాలతో పోల్చుకుంటే మెరుగ్గా నిలిచింది. వర్క్ ఫ్రం హోం ద్వారా కూడా కంపెనీలు పని కొనసాగించడంతో పాటు, కొత్త నియామకాలు జరిపాయి. కానీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి మారింది. అమెరికాలో ఆర్థిక సంక్షోభం, పశ్చిమాసియా దేశాల్లో ఆర్థిక అనిశ్చితి కారణంగా ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం పడింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో చాలా ఐటీ కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగుల్ని తొలగించడం ప్రారంభించాయి. అట్రిషన్ రేటు పెరిగి, ప్రతి త్రైమాసికానికి ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో, జీతాలు పెంచకపోవడం, ప్రోత్సాహకాలను తగ్గించడం వంటి చర్యలు తీసుకున్నాయి. ముఖ్యంగా పెద్ద కంపెనీల్లో ఇది మరింత ప్రభావం చూపిస్తోంది. టీసీఎస్ (TCS) తర్వాత రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) కూడా వేతనాల పెంపును వాయిదా వేస్తోంది. 2023 నవంబర్ తర్వాత వేతనాల పెంపు ప్రకటించని ఈ కంపెనీ, తాజాగా 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో పెంపు ఉండవచ్చని పేర్కొంది.
HMPV : ఈ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ చిన్న పిల్లలనే ఎందుకు వేటాడుతోంది..?
జనవరిలో కొందరికి, ఏప్రిల్లో మిగతా ఉద్యోగులకు వేతనాల పెంపు ఉంటుందని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేశ్ సంఘ్రాజ్కా తెలిపారు. ఇన్ఫోసిస్ మాత్రమే కాకుండా హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్టీఐ మైండ్ట్రీ వంటి ప్రముఖ కంపెనీలు కూడా వేతనాల పెంపును వాయిదా వేశాయి. గ్లోబల్ డిమాండ్ మందగించడం, ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కంపెనీలు తమ బడ్జెట్ వ్యయాన్ని తగ్గించుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. వేతనాల పెంపు ఆలస్యం కావడం, తొలగింపుల ముప్పు వంటివి వారిపై ఆర్థిక భారం పెంచుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే ఐటీ రంగం పట్ల ఆకర్షణ తగ్గే ప్రమాదం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.