పెట్రోల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన..!
పీఎన్జీ, సీఎన్జీల 100 శాతం సరఫరాను నిర్ధారించామని, పెట్రోల్- డీజిల్ కూడా తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
- Author : Gopichand
Date : 01-04-2026 - 4:41 IST
Published By : Hashtagu Telugu Desk
Crude Oil: మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారతదేశంలో పెట్రోల్, డీజిల్, పీఎన్జీ (PNG), సీఎన్జీ (CNG) కొరతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలో రాబోయే 2 నెలల వరకు ఈ ఇంధనాల లభ్యతను తగినంతగా నిర్ధారించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ (LPG) ధరలు దాదాపు 40 శాతం పెరిగినప్పటికీ దేశీయ వినియోగదారుల కోసం ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదని వెల్లడించింది. దీనివల్ల చమురు కంపెనీలకు కొంత నష్టం వాటిల్లుతోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రెండు నెలల క్రితం బ్రెంట్ క్రూడ్ ధర 70 డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం అది 100 డాలర్లు దాటిందని మంత్రిత్వ శాఖ వివరించింది. అయినప్పటికీ ఏప్రిల్ 6, 2022 నుండి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోవడం సామాన్య ప్రజలకు ఊరటనిస్తోంది. ధరలు పెంచకపోవడం వల్ల చమురు కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయని కూడా సమాచారం ఇచ్చింది.
Also Read: పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని పొడిగించిన కేంద్రం.. ఎవరు అర్హులు అంటే?!
పీఎన్జీ, సీఎన్జీ, ఎల్పీజీల తగినంత సరఫరా
పీఎన్జీ, సీఎన్జీల 100 శాతం సరఫరాను నిర్ధారించామని, పెట్రోల్- డీజిల్ కూడా తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. 92 శాతం బుకింగ్లు ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయని, 81 శాతం డెలివరీలు ఆథెంటికేషన్ కోడ్ (OTP) ద్వారా పూర్తవుతున్నాయని పేర్కొంది. నిన్న ఒక్కరోజే 60 లక్షల సిలిండర్లు డెలివరీ కాగా, మార్చి 23 నుండి ఇప్పటివరకు 3.9 లక్షల (5 కిలోల) సిలిండర్లు అమ్ముడయ్యాయి. కిరోసిన్ను ప్రత్యామ్నాయ ఇంధనంగా రాష్ట్రాలకు అందించినట్లు కూడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఏటీఎఫ్ ధరలో 25 శాతం పెరుగుదల – మంత్రిత్వ శాఖ
ఏటీఎఫ్ (Aviation Turbine Fuel) ధర 25 శాతం పెరిగిందని, అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులతో పోలిస్తే ఈ పెరుగుదల చాలా తక్కువని మంత్రిత్వ శాఖ తెలిపింది. విమాన ప్రయాణం ప్రజలకు సులభంగా, అందుబాటులో ఉండేలా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేసింది.