Jagan Vizag Tour : జగన్ విశాఖ టూర్ పై ‘పీఠం’ పదనిస
రెండు రోజులుగా విశాఖ శ్రీ శారదాపీఠం పూజల్లో ఉన్న హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను కలుసుకోవడానికి ఏపీ సీఎం జగన్ మంగళవారం విశాఖపట్నం వెళుతున్నారు. ఆ మేరకు సీఎంవో కార్యాలయం టూర్ షెడ్యూల్ ను ఫిక్స్ చేసింది.
- Author : CS Rao
Date : 18-04-2022 - 5:33 IST
Published By : Hashtagu Telugu Desk
రెండు రోజులుగా విశాఖ శ్రీ శారదాపీఠం పూజల్లో ఉన్న హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను కలుసుకోవడానికి ఏపీ సీఎం జగన్ మంగళవారం విశాఖపట్నం వెళుతున్నారు. ఆ మేరకు సీఎంవో కార్యాలయం టూర్ షెడ్యూల్ ను ఫిక్స్ చేసింది. పర్యటనలో భాగంగా ఆయన ఉదయం 10:25 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11:05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి 11.50 గంటలకు రుషికొండ పెమా వెల్నెస్ రిసార్ట్కు వెళ్లి హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్తో భేటీ అవుతారు. అనంతరం మధ్యాహ్నం 1:25 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 2:30 గంటలకు తాడేపల్లిలోని తమ నివాసానికి చేరుకుంటారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసి పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు అందుకున్నారు. ధర్మ పరిరక్షణకు స్వరూపానందేంద్ర పీఠం చేస్తున్న కృషిని ఖట్టర్ కు పీఠం నిర్వాహకులు వివరించారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే హర్యానాలో కూడా శ్రీశారదాపీఠం ఆశ్రమం ఏర్పాటు చేస్తామన్నారు. రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు హర్యానా ప్రజలపై ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఖట్టర్ తెలిపారు. అంతకుముందు సీఎంకు పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం ఖట్టర్ సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు.