Jagan And PRC: శభాష్ జగన్..మానవీయ పీఆర్సీ.!
పే రివిజన్ అంటే పెంచడమే కాదు..తగ్గించడమూ ఉంటుందని నిరూపించిన ఏకైక సీఎం జగన్. వాస్తవాలకు అనుగుణంగా ఆయన తీసుకున్న నిర్ణయాలను ఉద్యోగులు జీర్ణించుకోలేక పోవచ్చు.
- By CS Rao Published Date - 03:26 PM, Tue - 18 January 22

పే రివిజన్ అంటే పెంచడమే కాదు..తగ్గించడమూ ఉంటుందని నిరూపించిన ఏకైక సీఎం జగన్. వాస్తవాలకు అనుగుణంగా ఆయన తీసుకున్న నిర్ణయాలను ఉద్యోగులు జీర్ణించుకోలేక పోవచ్చు. కానీ, మానవాభివృద్ధి సూచికను బెంచ్ మార్క్ గా తీసుకుంటే ఏపీ సీఎం జగన్ పీఆర్సీ మీద తీసుకున్న నిర్ణయం అక్షరాల సమర్థనీయం. కోవిడ్ -19 దెబ్బకు దేశ వ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య పెరిగింది. పేదలు నిరుపేదలుగా మారారు. నాలుగు సెకన్లకు ఒకరు బతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని తాజా ఆర్థిక నివేదిక చెబుతోంది. ధనికులు, పేదలకు మధ్య అంతరం పెరిగిందని తేల్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కోరిన విధంగా ఉద్యోగులకు జీతాలు పెంచడం పేదలకు అన్యాయం చేయడమే అవుతుంది. అందుకే, మానవీయ కోణం నుంచి ఆలోచించిన జగన్ ఉన్నదాంట్లో ఉద్యోగులను సంతృప్తి పరిచేలా తీసుకున్న నిర్ణయాన్ని శభాష్ అనకుండా ఉండలేమని ఆర్థిక వేత్తలు అంటున్నారు.
చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం పీఆర్సీని పెంచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు 12వేల కోట్లు భారం పడుతుంది. ఇప్పటికే జగన్ సీఎం అయిన తరువాత ఉద్యోగులకు వివిధ రూపాల్లో 13వేల కోట్లకు పైగా లబ్ది చేకూర్చాడు. దీన్లో కొత్త ఉద్యోగాల నియామకం కూడా ఉంది. ఇక ఇప్పటి వరకు డబుల్ హెచ్ ఆర్ ఏలను తీసుకుంటున్న ఉద్యోగులకు ఒక హెచ్ ఆర్ ఏ ను ఫిక్స్ చేశాడు. చంద్రబాబునాయుడు సీఎం గా ఉన్న సమయంలో ఉద్యోగులు కోరిన విధంగా డబుల్ హెచ్ ఆర్ ఏ, ఉచిత ప్రయాణం, ఉచిత భోజనం, ఉచిత వైద్యం, ప్రత్యేక రైళ్లు, బస్సులు, వారానికి ఐదు రోజుల పనిదినాలు..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సౌకర్యాలను కల్పించాడు. ఫలితంగా రాష్ట్ర బడ్జెట్ లోని అధిక వాటా ఉద్యోగులకు ఎంజాయ్ చేస్తున్నారు.
రెండేళ్లుగా సామాన్యులు కోవిడ్ -19తో బతికలేని పరిస్థితుల్లోకి వెళ్లారు. రైతులు, కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులు జీతాల్లేక అల్లాడి పోతున్నారు. కానీ, ప్రభుత్వ ఉద్యోగుల పనిచేయకుండానే ఎక్కువ మంది లక్షల్లో జీతాలను తీసుకున్నారు. ఏ ఒక్కరూ కోవిడ్ -19 పరిణామానికి స్పందించి జీతాలను కట్ చేసుకుంటామని ముందుకు రాలేదు. ప్రజల జీవన ప్రమాణాలను గాలికి వదిలారు. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రస్తుతం సీఎం జగన్ నానా తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం 7లక్షల కోట్ల అప్పుట్లో రాష్ట్రం ఉంది. అయినప్పటికీ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగుల వాటాను బడ్జెట్ లో కొనసాగించాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. అప్పులు ఇవ్వడానికి ఏ సంస్థా ముందుకురాని విధంగా ఉద్యోగులు ఏపీ ఆర్థికాన్ని ఛిన్నాభిన్నం చేసేలా తెలంగాణతో పోటీపడి జీతాలను పెంచే వరకు ఆనాడు చంద్రబాబుపై ఒత్తిడి చేసి విజయం సాధించారు.ఇప్పుడు జగన్ ఎదుట ఉద్యోగుల పప్పులు ఉడకడంలేదు. గతంలో మాదిరిగా రాజకీయాలను శాసించాలని చూసే వాళ్లను అదుపులో ఎలా పెట్టాలో..బాగా తెలిసిన సీఎం జగన్. మానవీయ కోణం నుంచి ఆలోచిస్తూ..సామాన్యుల పక్షాన నిలుస్తూ ఉద్యోగులకు ఎంత ఇవ్వాలో..అంతే ఇస్తున్నాడు. కానీ, విపక్షాలు ఓట్ల రాజకీయం కోసం ఉద్యోగుల పక్షాన నిలుస్తూ రాష్ట్ర ఆర్థికాన్ని మరింత ఛిన్నాభిన్నం చేయాలని చూస్తున్నారని ఆర్థిక వేత్తల అభిప్రాయం.
ఏపీ సర్కార్ తీసుకున్న పీఆర్సీ నిర్ణయాల్లో హెచ్ ఆర్ ఏ కటింగ్.. సీసీఏ ఎత్తివేత..80 ఏళ్ల వరకు అదనపు పెన్షన్ రద్దు వంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. డబుల్ హెచ్ ఆర్ ఏను అనుభవిస్తోన్న వాళ్లకు హెచ్ఆర్ఏలో కోత.. క్వాంటమ్ పెన్షన్ శ్లాబుల్లో మార్పు, పెండింగ్ డీఏలు ‘ఐఆర్’లో సర్దుబాటు..తదితర అంశాలు ఉన్నాయి. అంతేకాదు ఇకపై రాష్ట్ర స్థాయిలో పీఆర్సీలు ఉండవని జగన్ తేల్చాశాడు. పదేళ్లకోసారి కేంద్రం వేసే కమిషన్లే ఆధారం.. చేసుకుని జీతాలు ఉంటాయని పీఆర్సీ జీవోలను ఏపీ సర్కార్ విడుదల చేసింది.
చట్టబద్ధంగా ఏర్పడిన అశుతోశ్మిశ్రా కమిషన్ను కాదని.. తాను సొంతంగా నియమించిన ‘సీఎస్ కమిటీ’ నివేదికకే జై కొట్టింది. చంద్రబాబు ఇచ్చిన డబుల్ హెచ్ ఆర్ ఏలకు జగన్ చెక్ పెడుతూ అద్దె భత్యం(హెచ్ఆర్ఏ)కు కూడా భారీగా కోత పెట్టింది. సీసీఏను పూర్తిగా ఎత్తేసింది. ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టిన డీఏలను విడుదల చేసి..శభాష్ అనిపించాడు జగన్.ఇప్పటికే ఐఆర్ 27శాతం కంటే తక్కువ ఫిట్మెంట్ (23.29 శాతం) ప్రకటించిందని ఉద్యోగులు భావిస్తున్నారు. హెచ్ఆర్ఏ, సీసీఏ, డీఏల్లోనూ ఉద్యోగులకు ఝలక్ ఇచ్చిందని కొంత మీడియా ఫోకస్ చేస్తోంది. క్వాంటమ్ పెన్షన్లలోనూ ఒక శ్లాబు ఎత్తేసింది. దీంతో పీఆర్సీతో పెరగాల్సిన ఉద్యోగుల వేతనాలు ‘రివర్స్’ గేరు వేశాయని వాస్తవాలకు విరుద్ధంగా జగన్ మీద ప్రచారం జరుగుతోంది. రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీని రూ.12లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచడం జగన్ మానవీయ కోణంలోని హైలెట్ పాయింట్.జనాభా ప్రాతిపదికన నాలుగు కేటగిరీల్లో హెచ్ఆర్ఏను నిర్ణయించారు. ఇప్పుడు ప్రభుత్వం వాటిని మూడుకు కుదించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో ఏర్పాటైన రాష్ట్ర సచివాలయం, హెచ్వోడీ ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో సచివాలయం, హెచ్వోడీల ఉద్యోగులకు డబుల్ హెచ్ ఆర్ ఏ రూపంలో 30 శాతం హెచ్ఆర్ఏ లభించేది. ఇప్పుడు దీనిని 16శాతానికి కుదించారు. అంటే… వీరందరికీ 14 శాతం కోత పడినట్లు ప్రచారం జరుగుతోంది. గుంటూరు, విశాఖ, నెల్లూరు, విజయవాడ నగరాల్లోని ప్రభుత్వ సిబ్బందికి గతంలో 20 శాతం హెచ్ఆర్ఏ వచ్చేది. దీనిని 16శాతానికి కుదించారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో 14.5 హెచ్ఆర్ఏ ఉండగా… దానిని 8 శాతానికి కుదించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగులకు 12 శాతం ఉన్న హెచ్ఆర్ఏ ఇప్పుడు 8 శాతానికి దిగిపోయింది. రాష్ట్రంలో నాలుగు పట్టణాలు మినహా… అన్ని గ్రామాలు, మున్సిపాల్టీలలో పని చేసే సిబ్బందికి ఇకపై 8 శాతం హెచ్ఆర్ఏ మాత్రమే లభిస్తుంది. 50 లక్షలపైగా ఉన్న జనాభా ఉన్న నగరాల్లో పని చేసే సిబ్బందికి 24 శాతం హెచ్ఆర్ఏ వర్తిస్తుందని జీవోల్లో తెలిపారు.రాష్ట్రంలో అంత జనాభా ఉన్న నగరం లేనట్టే అంటే… ఈ శ్లాబు ఉన్నా, లేనట్లే!
సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ (సీసీఏ)ను కూడా జగన్ ప్రభుత్వం ఎత్తేసింది. గతంలో విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో పని చేసే సిబ్బందికి రూ.500… సచివాలయం/హెచ్వోడీ సిబ్బందికి రూ.వెయ్యి సీసీఏ లభించేది. ఇప్పుడు ‘సీఎస్ కమిటీ’ సిఫారసుల పేరుతో… ఈ ప్రయోజనాన్ని ఎత్తివేయడం ఉద్యోగులకు నచ్చడంలేదు.
మినిమం బేసిక్ స్కేలుకు 23 శాతం ఫిట్మెంట్తో… 2018 జూలై ఒకటో తేదీ నాటికి పెండింగ్లో ఉన్న 30.392 శాతం డీఏలను కలిపి పే స్కేల్స్ను సవరించారు. పేరుకు 23 శాతం ఫిట్మెంట్ అయినప్పటికీ… పే స్కేల్స్లో దక్కేది 19 శాతం ఫిట్మెంట్ మాత్రమేని ఉద్యోగుల భావన. వీటిలో హెచ్ఆర్ఏ, సీసీఏ, ఇతర ప్రయోజనాల్లో కోతను తీసేస్తే… ప్రభుత్వం తాను అనుకున్నట్లుగా 14.29 శాతం ఫిట్మెంట్నే ఇచ్చినట్లయ్యిందని ఉద్యోగులు లెక్కిస్తున్నారు.
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా 70-80 ఏళ్ల మధ్య వయసున్న ఎక్కువ మంది పింఛన్దారులు లబ్ధి పొందే అదనపు క్వాంటమ్ను పూర్తిగా ఎత్తేసింది. దీంతో వీరిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఉద్యోగులు అంటున్నారు. పదవీ విరమణ తర్వాత సాధారణ పింఛను ఇస్తూనే.. పింఛనుదారులకు 70 ఏళ్ల నుంచి 100 ఏళ్ల వరకు అదనపు క్వాంటమ్ పింఛన్ను ఇస్తున్నారు.
దీనిలో భాగంగా 70-75 ఏళ్ల మధ్య ఉన్నవారికి 10 శాతం, 75-80 ఏళ్లు ఉన్నవారికి 15 శాతం, ఇలా వందేళ్ల వరకు పెంచేవారు. అయితే, ఇప్పుడు ఈ అదనపు క్వాంటమ్ను తొలగించారు. 80 ఏళ్లు పైబడితేనే అదనపు క్వాంటమ్ పింఛను లభిస్తుంది. వాస్తవానికి 70-80 ఏళ్ల మధ్య ఉన్న పింఛనుదారులు ఆరోగ్య సమస్యలతో సతమతమవడం సహజం. ఈ నేపథ్యంలో వీరికి అదనపు క్వాంటమ్ ఎంతో ఉపయుక్తంగా ఉండేది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఆ పదేళ్లపాటు అదనపు క్వాంటమ్ను లేకుండా చేసింది. ఫలితంగా 80 ఏళ్లు వచ్చే వరకు పింఛనుదారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే గ్రాట్యుటీని ప్రభుత్వం రూ.16 లక్షలకు పెంచింది. కనీస కుటుంబ పింఛను ఇక నుంచి రూ.10 వేలుగా పేర్కొంది. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీలను ఏర్పాటు చేయడం, వాటిప్రకారం పింఛను పెంచడం ఉండదు. కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ ప్రకారమే రాష్ట్రంలోని పింఛనుదారులకు కూడా ప్రయోజనాలను నిర్ణయిస్తారు. అదేవిధంగా డీఏపై కేంద్రం నిషేధం విధించిన కాలానికి సంబంధించి రాష్ట్రంలో ఇవ్వాల్సిన మూడు డీఏలను.. 18 నెలల ఆలస్యంగా పింఛనుదారులకు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం మీద ఉద్యోగుల కొంతెమ్మ కోర్కెలకు దూరంగా ఇప్పుడున్న వాస్తవ పరిస్థితుల కంటే మిన్నగా జగన్ పీఆర్సీ ప్రకటించాడని ఆర్థిక వేత్తల అభిప్రాయం. విపక్షాలు, ఉద్యోగ సంఘనేతలు , మీడియాలోని ఒక భాగం మాత్రం భిన్నంగా రియాక్ట్ అవుతోంది. పీఆర్సీ అంటే పెంచుకుంటూ పోవడం కాదని నిరూపించిన ఏకైక సీఎం జగన్. ఆయన ఆలోచన ఆలోచన ఆర్థిక వేత్తల దృష్టలో శభాష్ అనిపించుకుంటోంది.