YS Jagan & SR NTR : మంత్రిమండలి రద్దుపై `ఇద్దరూ ఇద్దరే`
స్వర్గీయ ఎన్టీఆర్ మంత్రి మండలిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆప్పట్లో ఒక సంచలనం. బడ్జెట్ ప్రతిపాదనలను లీకు చేశారని అనుమనిస్తూ 31 మంది మంత్రులను ఒక కలం పోటుతో పీకేశారు.]
- By CS Rao Published Date - 12:20 PM, Thu - 7 April 22
స్వర్గీయ ఎన్టీఆర్ మంత్రి మండలిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆప్పట్లో ఒక సంచలనం. బడ్జెట్ ప్రతిపాదనలను లీకు చేశారని అనుమనిస్తూ 31 మంది మంత్రులను ఒక కలం పోటుతో పీకేశారు. ఆనాడు ఆయన చేసిన సాహసం రాజకీయ చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ప్రభుత్వానికి పూర్తి మద్ధతు ఉండగా, ఎన్నికలకు సుదూర సమయంలో మంత్రివర్గమంతా రాజీనామా చేసిన చరిత్ర ఎన్టీఆర్ హయాంలో జరిగింది. క్యాబినెట్ సహచరులందరినీ భర్తరఫ్ చేసేందుకు ఎన్టీఆర్ ఆనాడు రాజీనామాలు తీసుకున్నారు. 1985లో రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలానికి మారిన రాజకీయ పరిణామాల్లో ఎన్టీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారు.కారణాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఇంచుమించు ఎన్టీఆర్ తరహాలోనే మంత్రిమండలి రద్దుకు జగన్ సిద్ధం అయ్యాడు. ఏపీ చరిత్రలో మంత్రివర్గం రాజీనామా చేయడం ఇది రెండోసారి అవుతుంది. మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల పాటు మాత్రమే ఉంచుతామని జగన్ మొదటే ప్రకటించారు. అందుకు తగిన విధంగా మూడేళ్ళు పూర్తికావస్తున్న తరుణంలో ఇప్పుడు మంత్రుల రాజీనామాలు తీసుకోబోతున్నారు. అయితే, బర్తరఫ్ కోసం కాకుండా పునర్వవస్థీకరణ కోసం ఇలా జరుగుతోంది.
ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఆదిమూలపు సురేశ్, సీదిరి అప్పలరాజు, గుమ్మనూరు జయరాం, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిలో ముగ్గురు లేదా నలుగురిని మళ్లీ మంత్రులుగా తీసుకుంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత కేబినెట్లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నలుగురు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఐదుగురు, బీసీల నుంచి ఏడుగురు, ఎస్టీల నుంచి ఒకరు, మైనార్టీల నుంచి ఒకరు, కాపు సామాజిక వర్గం నుంచి నలుగురు, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరు, క్షత్రియుల నుంచి ఒకరు, వైశ్య సామాజిక వర్గం నుంచి ఒకరు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రులుగా ఐదుగురిని నియమించగా వారిలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు. ఇదే ఈక్వేషన్ మళ్లీ కొనసాగిస్తూ జగన్ క్యాబినెట్ ఉంటుందా? మార్పులు విభిన్నంగా ఉంటాయా? అనేది ఉత్కంఠతను కలిగిస్తోంది.గురువారం మధ్యాహ్నం 3 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రస్తుత మంత్రులకు ఇదే చిట్టచివరి సమావేశం. ఆ తరువాత వారంతా మాజీలు అవుతారు. గవర్నర్తో బుధవారం జగన్ భేటీ అనంతరం మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ మరింత వేగవంతం అయింది. ఈ భేటీలో పాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటును కూడా గవర్నర్కి వివరించారు సీఎం జగన్. గత వారం రోజులుగా సొంత రాష్ట్రం ఒడిశా, ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ మంగళవారం రాత్రే ఢిల్లీ నుంచి విజయవాడ రాజ్భవన్కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి. బుధవారం సాయంత్రం విజయవాడ చేరుకున్న జగన్ ఆయనతో భేటీ అయ్యారు.
ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగుతున్న కొందరిని తొలగించి కొత్త వారికి మంత్రి పదవులు అప్పగిస్తానని ఇప్పటికే సీఎం జగన్ స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగుతున్న వారిలో ఎవరుంటారు? ఎవరికి ఉద్వాసన పలుకుతారు? కొత్తగా ఎవరికి అవకాశం కల్పిస్తారు? అన్నది హాట్ టాపిక్ గా మారింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రస్తుత మంత్రివర్గ సభ్యులతో సీఎం జగన్ సంకేతాలు ఇవ్వనున్నారు. ప్రస్తుతమున్న మంత్రుల్లో ఎవరు కొనసాగుతారనే దానిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు.మంత్రులుగా పదవులను కోల్పోయిన వాళ్లు సీఎం జగన్ కి మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా పత్రాలు ఇవ్వనున్నారు. 10వ తేదీన కొత్తగా మంత్రివర్గంలో స్థానం పొందే వారికి సీఎం జగన్ సమాచారం ఇవ్వనున్నారు. ఈ నెల 11 వ తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది. అదే రోజు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాబోయేది ఎన్నికల కాలం కానుండటంతో మంత్రి వర్గంలో తీసుకునేవారి విషయంలో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంతాలు, కొత్త జిల్లాలు, కులాల సమీకరణలను దృష్టిలో ఉంచుకొని మంత్రి వర్గంలో కొత్తవారికి అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారికి మంత్రి వర్గ విస్తరణలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.చిత్తూరు జిల్లా నుంచి నగరి జిల్లా నుంచి రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తొలిసారే ఆమె మంత్రి పదవిని ఆశించారు. అయితే, ఆమెకు మంత్రిపదవి దక్కలేదు. దాంతో తీవ్రమైన మనస్తాపానికి గురైన రోజా కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. పెద్దిరెడ్డిని మంత్రిగా కొనసాగిస్తే ఆమె ఆశలు ఈసారి కూడా గల్లంతే. ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ ను కొనసాగిస్తారా, సుధాకర్ బాబుకు స్థానం కల్పిస్తారా అనేది వేచి చూడాల్సిందే. నెల్లూరు జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ కు జగన్ మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.
కడప జిల్లా నుంచి కోరుట్ల శ్రీనివాసులు, అంజాద్ పాషాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి సిదిరి అప్పలరాజును మంత్రివర్గంలో కొనసాగించే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాస్ ను తప్పించి ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మంత్రిగా ధర్మాన ప్రసాదరావుకు విశేషమైన అనుభవం ఉంది. గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు, విడుదల రజని, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అంబటి రాంబాబు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో జగన్ తో మొదటి నుంచి కొనసాగుతున్నారు. టీడీపీని ఎదుర్కోవడంలో అంబటి రాంబాబు కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
విజయనగరం జిల్లా నుంచి రాజన్న దొర లేదా కళావతి మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా అబ్బయ్య చౌదరికి మంత్రివర్గంలో అవకాశం దక్కవచ్చు. తూర్పు గోదావరి జిల్లా నుంచి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు అవకాశం దక్కవచ్చు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు బెర్త్ ఖరారైనట్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్, కొలను పార్థసారథి, కొక్కలగడ్డ రక్షణనిధి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అనంతపురం జిల్లా నుంచి శంకరనారాయణను మంత్రివర్గంలో కొనసాగించాలా, ఉషాశ్రీ చరణ్ కు అవకాశం కల్పించాలా అనే ఆలోచన సాగుతోంది. కర్నూలు జిల్లా నుంచి జయరామ్ కు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్ప చక్రపాణి రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా నుంచి గుడివాడ అమర్నాథ్ కు వైఎస్ జగన్ మంత్రివర్గంలో అవకాశం దక్కవచ్చు. మంత్రివర్గంలో స్థానం కోల్పోయే సీనియర్ ఎమ్మెల్యేలను పార్టీ సమన్వయకర్తలుగా నియమించి, ఎన్నికలను ఎదుర్కునే బలమైన జట్టుగా తయారు చేయాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్టీని గెలుపు బాటలో నడిపించే జట్టుగా అది పనిచేస్తుంది.
Related News
AP Election Result 2024: జగన్ vs చంద్రబాబు… ప్రజలు ఎవర్ని నమ్మారు ?
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఆధిపత్య పోరుగా రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం.