Jagan : జగన్ మళ్లీ చిప్పకూడు తినడం ఖాయం – ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jagan : గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్న వేళ, సిట్ విచారణ వేగంగా కొనసాగుతోంది
- By Sudheer Published Date - 10:51 AM, Sat - 24 May 25

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) త్వరలో జైలుకు వెళ్లబోతున్నారని బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి (Jammalamadugu MLA Adinarayana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case)లో జగన్ చిప్పకూడు తినడం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలు తెలుగురాష్ట్రాల్లో భారీ చర్చనీయాంశంగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్న వేళ, సిట్ విచారణ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన అధికారులు, మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.
అవినాష్ రెడ్డికి కూడా ప్రమాదమే?
లిక్కర్ స్కాంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉందని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని జగన్ స్వయంగా అర్థం చేసుకుని, మీడియా ఎదుట మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టిన ఆయన, లిక్కర్ స్కాం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కి లేదన్నారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ తీసుకున్న అప్పులు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా దిశగా నెట్టేశాయని విమర్శించారు.
బీజేపీ మద్దతుతో అభివృద్ధి దిశగా రాష్ట్రం
ఇప్పటికే బీజేపీ మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. వివిధ కీలక రంగాల్లో పునాదులు వేయబడ్డాయని చెప్పారు. ఇదే సమయంలో లిక్కర్ స్కాంలో మరికొంతమంది నేతలు కూడా అరెస్ట్ అవతారని ఊహాగానాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లోనూ, ప్రజలలోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ కేసు తదుపరి దశలో ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది వేచి చూడాల్సిందే.