Wine Shop : ఏపీలో వైన్ షాప్స్ బంద్
Wine Shop : ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం సాయంత్రం నుంచి 27వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాన్ని నిలిపివేశారు
- Author : Sudheer
Date : 26-02-2025 - 9:57 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) కారణంగా మూడు రోజుల పాటు మద్యం షాపులను (Wine Shops) మూసివేశారు. ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం సాయంత్రం నుంచి 27వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాన్ని నిలిపివేశారు. ఉమ్మడి గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ, అలాగే ఉత్తరాంధ్ర (విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం) ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజుల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల సందర్భంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్తగా మద్యం షాపుల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు.
Tragedy : మహాశివరాత్రి రోజు ఏపీలో విషాదం
ఎన్నికల నియమావళి ప్రకారం.. పోలింగ్కు 48 గంటల ముందు మద్యం విక్రయాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగిసిన వెంటనే మద్యం షాపులను బంద్ చేశారు. మద్యం అక్రమంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు. మద్యం షాపులతో పాటు బార్లను కూడా మూసివేయాలని స్పష్టం చేశారు. ప్రజలు శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Gold Card : అమెరికా పౌరసత్వం కోసం గోల్డ్ కార్డ్.. రూ.43 కోట్లు చాలు !
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 8500 మంది పోలీసులను నియమించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, ఎన్నికల రోజు ఆయా జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఓటు హక్కును వినియోగించుకునేలా సౌకర్యాలు కల్పించాలని ఎన్నికల సంఘం సూచించింది.