Durga Temple EO : దుర్గగుడిలో ఈవో సీటుపై లొల్లి.. కొత్త ఈవోకి బాధ్యతలు ఇవ్వని పాత ఈవో
ఏపీలో రెండో అతిపెద్ద దేవాలయంగా పిలువబడే విజయవాడ దుర్గమల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో పాలన పడకేసింది.
- By Prasad Published Date - 08:03 AM, Wed - 11 October 23

ఏపీలో రెండో అతిపెద్ద దేవాలయంగా పిలువబడే విజయవాడ దుర్గమల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో పాలన పడకేసింది. రాజకీయ నాయకుల జోక్యం మితిమీరడంతో అధికారులు, రాజకీయ నాయకుల మధ్య వార్ నడుస్తుంది. అత్యంత కీలకమైన దసర ఉత్సవాల్లో అధికారులు, రాజకీయ నేతల మధ్య పోరు తీవ్రతరం కావడంతో ఉత్సవాల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఉత్సవాల సమయంలో ఈవోల బదిలీ లు కావడం భక్తుల్లో ఆందోళన నెలకొంది.ప్రస్తుత ఈవోగా ఉన్న భ్రమరాంభను ప్రభుత్వం రెండు రోజుల క్రితం బదిలీ చేసింది. అయితే ఆమె మాత్రం దుర్గగుడి ఈవో సీటు వదిలేదే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను ఆమె ధిక్కరిస్తున్నారు దసరా ఉత్సవాల నేపథ్యంలో కొత్త ఈవోగా కేఎస్ రామారావును ప్రభుత్వం నియమిచింది. అయితే తనకి ఇంకా కొత్త ఈవోకు బాధ్యతలు ఇవ్వాలని ఆదేశాలు అందలేదని ఈవో భ్రమరాంబ చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
నిన్న (మంగళవారం) మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టేందుకు నూతన ఈవో కేఎస్ రామారావు దుర్గగుడికి వచ్చారు. నూతన ఈవో రామారావుకు బాధ్యతలు ఇప్పటివరకు భ్రమరాంబ అందించకపోవడంతో ఆయన ఖంగుతిన్నారు. ఈవో భ్రమరాంబ వింత పోకడ పై అధికార పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ధిక్కరిస్తే తగు చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. ఈ విషయంపై సీఎం జగన్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైయ్యారు. మంగళవారం ఉదయం జరిగిన సమన్వయ సమావేశానికి ట్రస్ట్ బోర్డును పిలవకపోవడంతో వివాదం మరింతముదిరింది.
Also Read: HCA : హెచ్సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్కు సుప్రీంకోర్టు షాక్
గతంలో కూడా ఈవోకి ట్రస్ట్బోర్డు సభ్యులకు మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. దుర్గగుడి ఛైర్మన్కి ఈవోకి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా పరిస్థితి నెలకొంది. ఓ వైపు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న దసరా ఉత్సవాలకు ఏర్పాట్లను చేయాల్సి ఉండగా.. ఈవో, బోర్డు సభ్యుల మధ్య వివాదం కొనసాగుతుండటంతో ఉత్సవాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఈ వివాదానికి ప్రభుత్వం ఏ విధంగా ఫుల్స్టాప్ పెడుతుందో వేచి చూడాలి.