Uppada : ఉప్పాడ తీరంలో రాకాసి అలల బీభత్సం.. మాయపట్నం గ్రామంలో మునిగిన ఇళ్లు
Uppada : కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో రాకాసి అలల ఉద్ధృతి తీవ్రంగా పెరిగింది. ఈ నేపథ్యంలో మాయపట్నం గ్రామం మొత్తం నీట మునిగిపోయింది.
- By Kavya Krishna Published Date - 04:50 PM, Wed - 23 July 25

Uppada : కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో రాకాసి అలల ఉద్ధృతి తీవ్రంగా పెరిగింది. ఈ నేపథ్యంలో మాయపట్నం గ్రామం మొత్తం నీట మునిగిపోయింది. గ్రామంలో అనేక ఇళ్లకు నీరు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి రాగానే ఆయన వెంటనే స్పందించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ , ఇతర అధికార యంత్రాంగంతో టెలిఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించి, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
మాయపట్నం గ్రామ ప్రజలకు అత్యవసర సహాయం అందించడానికి ఆహారం, పాలు, తాగునీరు వంటి అవసరమైన సరకులను తక్షణమే పంపిణీ చేయాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా గ్రామంలో వైద్య బృందాలను మోహరించి, అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.
రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గతంలో తీర రక్షణ కోసం నిర్మించిన రక్షణ గోడలు, జియో ట్యూబులు సక్రమంగా పని చేస్తున్నాయా, అదనపు చర్యలు తీసుకోవాలా అనే విషయంపై కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు.
“ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ప్రాధాన్యత. సహాయక చర్యల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదు” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తీర ప్రాంత గ్రామాల్లో ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి స్థానిక ప్రజలతో సమన్వయం చేసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు.
Rajasingh : రాజాసింగ్ వెనకడుగు వేసినట్లేనా..?