వాళ్లు ఫలితం అనుభవిస్తున్నారు.. కొడాలి నాని, వంశీ పై టీడీపీ సీనియర్ లీడర్ ఫైర్
- Author : Vamsi Chowdary Korata
Date : 31-12-2025 - 3:54 IST
Published By : Hashtagu Telugu Desk
Gorantla Butchaiah Chowdary : వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్పై టీడీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని వారిద్దరికీ చాలాసార్లు చెప్పానని.. వినకపోవటంతోనే పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చిందని అన్నారు. ఇప్పుడు ఫలితాన్ని అనుభవించాల్సి వస్తోందంటూ గోరంట్ల హాట్ కామెంట్స్ చేశారు. మరోవైపు చంద్రబాబు విజనరీ లీడర్షిప్ను పవన్ కళ్యాణ్ సైతం అర్థం చేసుకున్నారని అన్నారు.
వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ గురించి తెలుగు రాజకీయాలపై కనీస అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పార్టీలో ఉన్నా కూడా దూకుడైన రాజకీయాలతో పాలిటిక్స్లో తమదైన ముద్ర వేశారిద్దరూ. తెలుగుదేశం పార్టీ అంటే విరుచుకుపడే ఈ ఇద్దరు నేతలు.. గతంలో టీడీపీలో పనిచేసిన వారే కావడం విశేషం. అయితే వివిధ రాజకీయ పరిస్థితులు, పరిణామాల మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడాలి నాని , వల్లభనేని వంశీ.. వైఎస్ జగన్కు నమ్మకస్తులుగా మారిపోయారు. వైఎస్ జగన్ మంత్రివర్గంలో కొడాలి నాని మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2024 ఎన్నికల్లో పక్కాగా గెలుస్తామని అనుకున్న ఇద్దరు నేతలు.. ఓటమి పాలయ్యారు.
అటు గుడివాడ నుంచి కొడాలి నాని.. ఇటు గన్నవరం నుంచి వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత వల్లభనేని వంశీని పలు కేసులు చుట్టుముట్టడం.. ఆయన జైలుకు వెళ్లడం కూడా తెలిసిందే. ఇక కొడాలి నాని అనారోగ్యానికి గురై.. ఆపరేషన్ చేయించుకుని ప్రత్యక్ష రాజకీయాల నుంచి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలపై టీడీపీ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి .. కొడాలి నాని, వల్లభనేని వంశీపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాజమండ్రిలో విలేకర్లతో మాట్లాడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.
కొడాలి నాని, వల్లభనేని వంశీకి నోరు అదుపులో పెట్టుకోమని గతంలో చాలాసార్లు చెప్పానన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. తన మాట వినకపోవటంతో ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎన్ని అవమానాలు ఎదురైనా, ఇబ్బందులు వచ్చినా కూడా ఏపీలో కూటమి కొనసాగుతుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ను మరోసారి అధికారంలోకి రానివ్వబోమని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని అభివర్ణించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ అర్థం చేసుకుని, చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే కూటమి సఖ్యతను చెడగొట్టేందుకు వైసీపీ యత్నిస్తోందని ఆరోపించారు.