AP Building Structures : ఏపీలో మున్సిపాలిటీల చేతికి భవన నిర్మాణాల అనుమతుల అధికారం
AP Building Structures : ఈ మార్పు వల్ల ప్రజలకు వేగంగా సేవలు అందించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది
- By Sudheer Published Date - 04:44 PM, Sun - 12 January 25

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) భవన నిర్మాణాలు, లేఔట్ల (AP Building Structures)అనుమతుల వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పట్టణాభివృద్ధి సంస్థ (డీటీసీపీ) ద్వారా ఈ అనుమతులు జారీచేయగా, ఇప్పుడు ఈ అధికారాలను మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు, నగర, గ్రామ పంచాయతీలకు బదిలీ చేసింది. ఈ మార్పు వల్ల ప్రజలకు వేగంగా సేవలు అందించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. చిన్న లేఔట్లకు, భవన నిర్మాణాలకు సంబంధించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అనుమతుల ప్రక్రియను స్వయంగా నిర్వహించనున్నాయి. అయితే, నగర పంచాయతీల పరిధిలో 3 ఎకరాలపైన ఉన్న లేఔట్లకు మాత్రం డీటీసీపీ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇది పర్యావరణ పరిరక్షణ, ప్రణాళికా అనుసరణకు కీలకమని పేర్కొంది. ఈ మార్పులు ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. స్థానిక సంస్థలు అనుమతుల విధానాన్ని నిర్వహించడం వల్ల, దరఖాస్తు ప్రక్రియ వేగవంతం అవుతుందని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు తగ్గుతాయని నమ్మకాన్ని వ్యక్తం చేసింది.
Worlds Smartest Pen : న్యూవా పెన్.. పెన్నులో కూడా ఇన్ని ఫీచర్లా ?!
ఈ మార్పులతో స్థానిక సంస్థలు భవన నిర్మాణ అనుమతుల ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. మున్సిపాలిటీలు, పంచాయతీలు ఈ ఆదాయాన్ని పట్టణాభివృద్ధి పనుల కోసం వినియోగించుకోవచ్చు. తగిన పర్యవేక్షణతో ఈ విధానం సమర్థవంతంగా అమలవుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీని ద్వారా భవన నిర్మాణ రంగంలో వేగవంతమైన అనుమతులు పొందడంలో సాయపడతాయని ఒక వర్గం ప్రశంసిస్తోంది. కానీ, తగిన పర్యవేక్షణ లేకుంటే, అక్రమ నిర్మాణాలు, పర్యావరణ సమస్యలు పెరుగుతాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ మార్పులు అమలులో ఎంతవరకు సమర్థవంతంగా ఉంటాయో వేచి చూడాలి.