TDP Membership: టీడీపీ సభ్యత్వ నమోదు అక్టోబర్ 26 నుండి ప్రారంభం
- By Kode Mohan Sai Published Date - 03:47 PM, Fri - 25 October 24

తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. పార్టీని బలోపేతం చేయడం, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై పార్టీ నేతలతో చర్చించారు. ఈ నెల 26వ తేదీ శనివారం నుండి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో చేపట్టేలా తెదేపా ఏర్పాట్లు చేస్తోంది.
తెదేపా కార్యకర్తలు రూ.100 సభ్యత్వం చెల్లించినందుకు, వారికి రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా అందించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధి కోసం సాయం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీని ద్వారా పార్టీ తన కార్యకర్తల సంక్షేమానికి నిబద్ధతను ప్రదర్శిస్తోంది.
అలాగే, రెండో దఫా నామినేటెడ్ పదవుల భర్తీ పై ముఖ్యమంత్రి మూడు గంటల పాటు పార్టీ నేతలతో చర్చలు జరిపించారు. దీనిని చూస్తుంటే, సాధ్యమైనంత త్వరగా రెండో లిస్ట్ విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. మొదటి దశలో ఇచ్చిన 20 నామినేటెడ్ పదవులకు రెట్టింపు సంఖ్యలో రెండో జాబితా ఉండనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కూటమి పార్టీలతో కూడా చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారు. కష్టపడిన వారికి మాత్రమే పదవి ఇవ్వాలనే విధానాన్ని అవలంబించాలనే నిర్ణయంతో, నామినేటెడ్ పోస్టులకు ఎంపికపై చర్చిస్తున్నారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా తెదేపా, తన కార్యకర్తలను ఆర్ధికంగా నిలబడేందుకు అవకాశం కల్పిస్తోంది. తద్వారా, పార్టీ సామర్థ్యాన్ని మరింత పెంచుకొని, కార్యకర్తలకు నైతిక బూస్ట్ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది.
సభ్యత్వ నమోదు ఈ సమయంలో పార్టీకి కీలకమైనది, ఎందుకంటే ఇది ఎన్నికల సమయానికి పార్టీ ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో జమిలి ఎన్నికలు జరుగుతాయి అంటున్న నేపథ్యంలో , తెదేపా, పార్టీని శక్తివంతంగా నిలబెట్టి, ప్రజల మన్ననలు గెలుచుకోవడానికి అన్ని విధాలా సిద్ధం అవటానికి ఇదే సరైన సమయం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మద్దతు పొందడంలో కీలకమైన భాగంగా మారింది అనడం లో ఎం సందేహం లేదు.