Devaragattu Festival : కర్రల సమరం.. 100 మందికి గాయాలు
Devaragattu Festival : దేవరగట్టులో జరిగే ఈ కర్రల సమరం సంప్రదాయంగా శక్తిదేవతకు చేసే పూజలో భాగమని భావిస్తారు. సాధారణంగా నియంత్రణలో జరిగే ఈ ఆచారం ఈసారి హింసాత్మకంగా మారడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది
- Author : Sudheer
Date : 03-10-2025 - 10:45 IST
Published By : Hashtagu Telugu Desk
కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని దేవరగట్టు(Devaragattu Festival)లో దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే కర్రల సమరం ఈసారి ఘోరంగా మారింది. పాతకాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయ సమరం ప్రతి సంవత్సరం భక్తులు, గ్రామస్థుల మధ్య ఉత్సాహంగా సాగుతుంది. కానీ ఈసారి ఉత్సవమూర్తులను దక్కించుకునే పోటీలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. మాటామాటా పెరిగి కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో వేదిక హింసాత్మకంగా మారింది.
AP Cabinet Meeting : నేడు క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడగా, ఇద్దరు మరణించారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వారిని వెంటనే ఆదోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కర్రల సమరాన్ని నియంత్రించేందుకు పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసినా, సుమారు 800 మంది పోలీసుల కృషి కూడా ఉద్రిక్తతను ఆపలేకపోయింది. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడటంతో ఆసుపత్రుల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది.
దేవరగట్టులో జరిగే ఈ కర్రల సమరం సంప్రదాయంగా శక్తిదేవతకు చేసే పూజలో భాగమని భావిస్తారు. సాధారణంగా నియంత్రణలో జరిగే ఈ ఆచారం ఈసారి హింసాత్మకంగా మారడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించి, గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించాలని సూచించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా స్థానిక పాలకులు, నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.