Rajanikanth : శత`మాటల`భవతీ! సూపర్ స్టార్ పై `ఫైర్` బ్రాండ్స్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ఆయన కనిపించడాన్ని వైసీపీ కూడా తప్పుబడుతోంది.
- By CS Rao Published Date - 05:22 PM, Sat - 29 April 23
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth)మీద వైసీపీ విరుచుకుపడుతోంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ఆయన కనిపించడాన్ని కూడా తప్పుబడుతోంది. రాజకీయాల గురించి మాట్లాడేందుకు సందేహిస్తూనే చంద్రబాబునాయుడు (Chandra Babu)విజన్ గురించి నాలుగు మాటలు ఆ వేదిక మీద ప్రస్తావించారు. అంతే, ఆయన మీద దుమ్మెత్తి పోస్తున్నారు. అప్పట్లో జరిగిన అధికార మార్పిడి ఎపిసోడ్ ను ఆయనకు కూడా తగిలించారు. వైసీపీ భాషలో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వాళ్ల జాబితాలో రజనీకాంత్ ను కూడా కలిపేశారు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మీద వైసీపీ(Rajanikanth)
విజయవాడలోని కోరంకి వద్ద ఎన్టీఆర్ శతజయంతి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది హాజరైన ఆ సభలో స్వర్గీయ ఎన్టీఆర్ కీర్తిని, ఆయన జీవిత నేపథ్యం తదితరాలపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్ ప్రసంగాలు, అసెంబ్లీలో ఆయన ఇచ్చిన స్పీచ్ లు అన్నీ ప్రస్తుత తరానికి పరిచయడానికి పుస్తక రూపంలో బయటకు తీసుకొచ్చారు. ఆ వేడుకలో నందమూరి కుటుంబీకులు, పలు రంగాలకు చెందిన పెద్దలు కనిపించారు. తమిళ సూపర్ స్టార్ (Rajanikanth)ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు కేరింతలు కొట్టారు. ఎన్టీఆర్, చంద్రబాబు(Chandra Babu) పేర్లు ఆయన నోటి వెంట వచ్చిన ప్రతిసారీ చప్పట్లతో నినాదించారు. ఆ వేడుకను చూసిన వైసీపీలోని కొందరు లీడర్లు తట్టుకోలేకపోయారేమో, తెల్లారేసరికి రజనీకాంత్ మీద విరుచుకుపడేందుకు మీడియా ముందుకొచ్చారు.
హైదరాబాద్ అభివృద్ధికి , చంద్రబాబు విజన్ కు సంబంధంలేదని రోజా
తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజా(Roja) ఇప్పుడు వైసీపీలోనూ అదే పంథాను కొనసాగిస్తున్నారు. మంత్రి హోదాలో ఆమె తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth)వేడుకలకు రావడాన్ని తప్పుబట్టారు. ఏపీ రాజకీయాల మీద అవగాహన లేదని కొట్టిపారేశారు. హైదరాబాద్ అభివృద్ధికి , చంద్రబాబు (Chandra Babu)విజన్ కు సంబంధంలేదని రోజా వివరించే ప్రయత్నం చేయడం గమనార్హం. విజన్ 2020 రచించిన చంద్రబాబు 2004 నుంచి 2014 వరకు అధికారంలో లేరని, వైఎస్ హయాంలో అంతా అభివృద్ధి జరిగిందని ఏదో చెప్పబోయారు. కానీ, అదే వేదిక పైనా చంద్రబాబు తయారు చేసిన విజన్ ప్రకారం వైఎస్, కేసీఆర్ వెళుతున్నారని చంద్రబాబు, రజనీ(Rajanikanth) చెప్పడాన్ని రోజా మరిచిపోయారు. విజన్ 2047 గురించి చెబుతోన్న చంద్రబాబు అప్పటికి ఎక్కడ ఉంటారో అంటూ రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించడం పలువురి విమర్శలను ఎదుర్కొంటోంది.
వైస్రాయ్ హోటల్ లో చెప్పులు వేసినప్పుడు రజనీకాంత్
ఇక మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ముందు నుంచే ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పక్కన రజనీకాంత్ ఎలా కూర్చుంటారు అంటూ ప్రశ్నించారు. శుక్రవారం శతజయంతి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నప్పుడే అంబటి విమర్శలను మొదలు పెట్టారు. ఎప్పుడూ చంద్రబాబు మీద ఒంటికాలు మీద లేచే మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని శనివారం మీడియా ముందుకు వచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫోటోను చూపుతూ వైస్రాయ్ హోటల్ లో చెప్పులు వేసినప్పుడు రజనీకాంత్ కూడా ఉన్నాడని సరికొత్త వాదనకు తెరలేపారు. ఏపీ భవిష్యత్ కోసం విజన్ 2047 సాకారం కావడానికి చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలని పరోక్షంగా రజనీకాంత్ చెప్పడాన్ని కొడాలి తప్పుబట్టారు. చంద్రబాబు, రజనీకాంత్ (Ranjanikanth)కు ఉన్న 30 ఏళ్ల అనుబంధాన్ని కూడా బయట పెట్టారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడ్ని చేయడానికి చంద్రబాబు ఎలా రజనీకాంత్ ఉపయోగపడ్డారు? అనే విషయాన్ని విశదపరిచారు. మొత్తం మీద చంద్రబాబు విజన్ ను ప్రశసించిన రజనీకాంత్ మీద వైసీపీ మూకుమ్మడి రాజకీయ దాడికి దిగింది.
Also Read : NTR@100: ఏపీకి చంద్రబాబు విజన్ అవసరం: రజనీకాంత్
రాజకీయాలకు దూరంగా ఉంటోన్న రజనీకాంత్ వైసీపీ నుంచి ప్రతిస్పందనలను ముందే గమనించినట్టున్నారు. ఎక్కడా రాజకీయాలను ప్రస్తావించకుండా జాగ్రత్తపడుతూ, చంద్రబాబుతో పంచుకున్న వేదిక మీద రెండు మాటలు రాజకీయం గురించి మాట్లాడతాను అంటూ ధైర్యం చేశారు. భావోద్వేగాలతో కూడిన వాళ్లిద్దరి బంధాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు విజన్ 2020 హైదరాబాద్ ను అమెరికాలా మార్చేసిందని కొనియాడారు. ఆ రోజుల్లో ఐటీని ప్రమోట్ చేయడం అంటే చంద్రబాబుకు(Chandra Babu) మాత్రమే సాధ్యమయిందని గుర్తు చేశారు. అంతేకాదు, విజన్ 2020 అంటే చులకనగా చూసిన వాళ్లు, 420 అన్న వాళ్లు కూడా లేకపోలేదని అవలోకించారు. దాదాపు 25 ఏళ్లకు ముందు ఆయన చేసిన విజన్ అందరి కళ్ల ముందు కనిపిస్తుందని చెబుతూ ఏపీ భవిష్యత్ చంద్రబాబు విజన్ 2047 మీద ఆధారపడిందని అన్నారు. దేశంలో ఏపీ నెంబర్ 1గా నిలవాలంటే చంద్రబాబు విజన్ ను అర్థం చేసుకోవాలని సూచించారు. ఆయన విలువ తెలుగు వాళ్ల కంటే బయట వాళ్లకు బాగా తెలుసని పరోక్షంగా ఏపీ ఓటర్లకు చురకలు వేశారు. ఆ స్పీచ్ ను విన్న వైసీపీ లీడర్లు తెల్లాసరికి రజనీకాంత్(Rajanikanth) మీద ఫైర్ కావడం గమనార్హం.
Related News
Chiranjeevi : చంద్రబాబుతో చిరంజీవి సమావేశం.. పిఠాపురం ప్రచారానికి..!
మే 11న చంద్రబాబుతో చిరంజీవి సమావేశం కాబోతున్నారా..? అలాగే పిఠాపురం వెళ్ళడానికి కూడా..