Vijayawada Rains : 30 ఏళ్ల రికార్డు బ్రేక్.. విజయవాడలో కుండపోత.. జనజీవనం అస్తవ్యస్తం
మధురానగర్ వంతెన, కృష్ణలంక అండర్గ్రౌండ్ వంతెనల వద్ద దాదాపు ఐదు అడుగుల వరకు నీరు నిలిచింది.
- Author : Pasha
Date : 01-09-2024 - 9:20 IST
Published By : Hashtagu Telugu Desk
Vijayawada Rains : 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి మొదలైన వర్షం శనివారం అర్ధరాత్రి దాకా కొనసాగింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా విజయవాడలో ఒకే రోజులో 29 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని పాతబస్తీ, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, జాతీయ రహదారి, ఆటోనగర్, పలు కాలనీలు, శివారు ప్రాంతాలలో భారీగా వరద పోటెత్తింది.మధురానగర్ వంతెన, కృష్ణలంక అండర్గ్రౌండ్ వంతెనల వద్ద దాదాపు ఐదు అడుగుల వరకు నీరు నిలిచింది. సాధారణంగానైతే ఇక్కడ వీఎంసీ మోటార్లు ఏర్పాటుచేసి వరద నీటిని ఎత్తిపోస్తారు. కానీ ఇంజిన్లు పాడయ్యాయని చెప్పి.. శనివారం రోజు వరద నీటిని ఎత్తిపోసే ప్రక్రియను చేపట్టలేదు.
We’re now on WhatsApp. Click to Join
విజయవాడ(Vijayawada Rains) యనమలకుదురులో కొండచరియలుపడి 20 మేకలు, గొర్రెలు మృతి చెందాయి. దుర్గగుడి కొండపై రాళ్లు జారిపడ్డాయి. ఘాట్రోడ్డు మూసివేశారు. విజయవాడ బస్టాండు ప్రాంతంలో రైల్వే అండర్ గ్రౌండ్ వంతెన దాదాపు ఏడు అడుగులు నిండిపోయింది. దీంతో బస్సుల రాకపోకలు నిలిచాయి.విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సమీపంలో విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద నీరు నిలిచింది. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
Also Read :Aloe Vera Juice: కలబంద జ్యూస్తో ఈ సమస్యలకు చెక్..?
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలోని అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగడంతో మహబాబాబాద్ శివారులో రైలుపట్టాలపైకి వరదనీరు చేరింది. ఇంటికన్నె-కేసముద్రం ట్రైన్ రూట్లో రైలు పట్టాలపై ఉండే కంకర కొట్టుకుపోయింది. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్పైకి వరదనీరు చేరింది. దీంతో పందిల్లపల్లి వద్ద దాదాపు 3 గంటల పాటు మహబూబ్నగర్-విశాఖ ఎక్స్ప్రెస్ రైలు ఆగిపోయింది. విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లు ఆగాయి. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ వద్ద మచిలీపట్నం, సింహపురి రైళ్లు ఆగాయి. రైల్వే ట్రాక్లపై నిలిచిన వరదనీరు తొలగిన తర్వాత ఆయా రైళ్లు వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు.