AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!
- Author : Prasad
Date : 22-06-2026 - 6:11 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్రంలోని ఐదు బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్ ఛైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడంవల్ల దివ్యాంగులకు వ్యయప్రయాసలు తగ్గుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ తయారీ యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటుచేసేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. తొలివిడత కింద ఒంగోలు, తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖ సర్వజన ఆసుపత్రుల్లో ఈ తయారీ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు, నిర్మాణాలు, ఇతర వసతుల పరిశీలన కేంద్ర బృందాల ద్వారా సోమవారం నుంచి ప్రారంభమైందని తెలిపారు. బోధనాస్పత్రుల్లోనే ‘సదరం’ కింద 21 రకాల దివ్యాంగ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు.
కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ ద్వారా దేశ వ్యాప్తంగా 102 తయారీ కేంద్రాలు నడుస్తున్నాయి. ‘ప్రధానమంత్రి దివ్యాంగ వయోశ్రీ’ పేరుతో ఇవి నడుస్తున్నాయి. వీటికి అదనంగా మరో 300 కేంద్రాలను 2030 నాటికి ఏర్పాటుచేయాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సీఎం శ్రీ చంద్రబాబు రాష్ట్రంలోని 27 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాలను ఏర్పాటుచేయాలని కేంద్రానికి లేఖ
రాశారు. దీనిని పరిశీలించిన మంత్రిత్వ శాఖ తొలివిడత కింద ఒంగోలు, తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖలోని బోధనాసుపత్రుల్లో వీటిని ఏర్పాటుచేసేoదుకు ముందుకొచ్చింది.