Paritala Sunitha: వైయస్ జగన్ రాప్తాడు పర్యటన నేపథ్యంలో పరిటాల సునీత సెన్సషనల్ కామెంట్స్..
వైఎస్ జగన్ పర్యటనపై పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. "జగన్ని రాకుండా ఆపే దమ్ము, ధైర్యం మాకు ఉన్నాయ్. ఎక్కిన హెలికాప్టర్ ను దిగకుండా తిరిగి పంపే శక్తి కూడా మన దగ్గర ఉందని" పేర్కొన్నారు.
- By Kode Mohan Sai Published Date - 04:14 PM, Mon - 7 April 25

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి, తోపుదుర్తి సోదరులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. “జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే, రాప్తాడు వైసీపీ టికెట్ బీసీలకు ప్రకటించాలి” అని ఆమె డిమాండ్ చేశారు. “తోపుదుర్తి బ్రదర్స్ చెప్పిన తప్పుడు మాటలు నమ్మి రాప్తాడులో ఫ్యాక్షన్ రాజకీయాలు చేయొద్దు” అని ఆమె సూచించారు.
ఇద్దరి మధ్య జరిగిన గొడవను, “తోపుదుర్తి బ్రదర్స్ రాజకీయం చేస్తున్నారు” అని ఆమె వ్యాఖ్యానించారు. “లింగమయ్య మరణంపై మొదటిగా బాధపడిన వ్యక్తిని నేనే” అని ఆమె చెప్పారు. “దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి, రిమాండ్కు తరలించాను” అని స్పష్టం చేశారు. “బీసీల పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే” అని చెప్పారు.
“జగన్ మోహన్ రెడ్డి లింగమయ్య కుటుంబానికి ఏదైనా సాయం చేయాలి. కానీ, తోపుదుర్తి బ్రదర్స్ చెప్పిన మాటలు విని బీసీ కులాల్లో చిచ్చు పెట్టకండి” అని ఆమె హెచ్చరించారు. “ఇప్పటికైనా, చనిపోయిన లింగమయ్య కుటుంబానికి సాయం చేయడానికి నేను ముందుంటాను” అని ఆమె స్పష్టం చేశారు.
జగన్ పర్యటనపై, “జగన్ని రాకుండా ఆపే దమ్ము, ధైర్యం మాకు ఉంది. ఎక్కిన హెలికాప్టర్ను దిగకుండా తిరిగి పంపే శక్తి కూడా మా దగ్గర ఉందని” ఆమె అన్నారు. “మా కార్యకర్తలు, నాయకులు కూడా ఇదే కోరుకుంటున్నారు, కానీ, మాకు సీఎం చంద్రబాబు ఇలాంటి సంస్కృతి నేర్పలేదని” ఆమె చెప్పారు. గతంలో, “పరిటాల రవి పులివెందులకు వెళ్లినప్పుడు మీరు అడ్డుకున్నారు. వాహనాలను తనిఖీ చేసి మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు” అని ఆమె పాత ఘటనను గుర్తుచేశారు.
“ఒక చావును రాజకీయం చేయడానికి జగన్ రెడ్డి వస్తున్నాడు. ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా, బాధిత కుటుంబానికి సహాయం చేయాలి” అని ఆమె అన్నారు. “ప్రకాష్ రెడ్డి చెప్పిన మాటలు విని, జగన్ వస్తున్నాడు. బీసీల మీద అంత ప్రేమ ఉంటే, రాప్తాడు ఇంఛార్జ్ని బీసీకి ఇవ్వాలని సలహా ఇస్తున్నాను” అని ఆమె సూచించారు. “టీడీపీ నేతలు ఎక్కడా సంయమనం కోల్పోవద్దు. ఎవరూ సహనం కోల్పోవద్దు” అని అందరికీ సూచించారు.