Papikondalu Boat Tour: పాపికొండలు విహారయాత్రకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Author : Kode Mohan Sai
Date : 26-10-2024 - 12:49 IST
Published By : Hashtagu Telugu Desk
పాపికొండల విహారయాత్ర పునఃప్రారంభం:
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యగమనిక, పాపికొండల విహారయాత్ర (Papikondalu Boat Tour) తిరిగి ప్రారంభమైంది. జులై 13 నుంచి గోదావరి వరదల కారణంగా ఈ యాత్రను నిలిపివేశారు, కానీ ఈరోజు శ్రీకారం చుట్టారు. గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులతో మూడు బోట్లలో వెళ్లి, శుక్రవారం రోజు మాక్ డ్రిల్ నిర్వహించి పరిశీలించారు.
గండిపోచమ్మ పాయింట్ నుంచి సర్ ఆర్థర్ కాటన్ పర్యాటక శాఖ బోటు ద్వారా 40 మంది పర్యాటకులు మరియు నాలుగురు సిబ్బంది ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. అలాగే, ఈరోజు నుంచి 14 ప్రైవేటు బోట్లు అందుబాటులో ఉండనున్నాయి.
పాపికొండల విహారయాత్ర వివరాలు:
ఈ పాపికొండల విహారయాత్రకు (Papikondalu Boat Tour) రాజమహేంద్రవరం నుంచి పర్యాటకులు ఉదయం 7:30 గంటలకు వాహనంలో బయలుదేరతారు. వారు గండిపోచమ్మ బోటు పాయింట్కు చేరుకొని, ఉదయం 9:30 గంటలకు యాత్ర ప్రారంభిస్తారు. సాయంత్రం 5:30 గంటలకు మళ్లీ గండిపోచమ్మ పాయింట్కు తిరిగి వస్తారు. గండిపోచమ్మ పాయింట్ నుంచి బయలుదేరి, సాయంత్రం 7:30 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు.
పాపికొండల విహారయాత్ర టికెట్ ధరలు మరియు సమాచారం:
ఈ పాపికొండల విహారయాత్రకు (Papikondalu Boat Tour) సంబంధించిన టికెట్ ధరలు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరం నుంచి పెద్దలకు రూ.1250, పిల్లలకు (పదేళ్ల లోపు) రూ.1000గా నిర్ణయించారు. గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి పెద్దలకు రూ.1000, పిల్లలకు (పదేళ్లలోపు) రూ.750గా నిర్ణయించారు. మరిన్ని వివరాల కోసం 9848629341కు సంప్రదించాలని సూచించారు.
పాపికొండలకు వెళ్లాలనుకునే పర్యాటకులు www.aptourismrajahmundri.com వెబ్సైట్లో ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. అలాగే, రాజమహేంద్రవరం నుంచి ప్రైవేట్ బోట్ ట్రిప్లు కూడా అందుబాటులో ఉంటాయి.
ఈ పాపికొండల విహారయాత్రలో(Papikondalu Boat Tour) భాగంగా, పాపికొండలు, పేరంటాలపల్లి ఆశ్రమం, ఆలయం, పోలవరం ప్రాజెక్ట్, దేవీపట్నం, కొరుటూరు కాటేజీలు, కొల్లూరు వెదురు గుడిసెలు వంటి అనేక ప్రాంతాలను వీక్షించవచ్చు. పాపికొండల మధ్య గోదావరిలో బోట్ రైడింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించే ఈ విహారయాత్ర కోసం నిత్యం వందలాది పర్యాటకులు వస్తున్నారు.