Vizag Steel Plant : వైసీపీ నేతలకు చెమటలు పట్టించిన నారా లోకేష్
Vizag Steel Plant : శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ (Lokesh) స్పష్టంగా మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని పునరుద్ఘాటించారు. కేంద్రం ఏ కార్యక్రమం చేపట్టినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటోందని గుర్తు చేశారు
- Author : Sudheer
Date : 24-09-2025 - 2:20 IST
Published By : Hashtagu Telugu Desk
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ (Vizag Steel Plant Privatisation) అంశం మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ (Lokesh) స్పష్టంగా మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని పునరుద్ఘాటించారు. కేంద్రం ఏ కార్యక్రమం చేపట్టినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటోందని గుర్తు చేశారు. అయితే, వైసీపీ మాత్రం పదే పదే తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తోందని లోకేష్ మండిపడ్డారు. అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వైసీపీ కృషి చేస్తోందని ఆయన ఆరోపించారు.
OG Mania : ఓవర్సీస్ లో దుమ్ములేపుతున్న ‘OG’ సంబరాలు
ఈ చర్చలో కొత్త మలుపు తీసుకొచ్చిన అంశం, వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి(Kalyani)తో లోకేష్ మాటల మార్పిడి. ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నప్పుడు అసభ్య పదజాలం వాడారంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. దీనిపై లోకేష్ స్పష్టతనిచ్చుతూ, ఎక్కడైనా తాను అభ్యంతరకరమైన పదజాలం వాడితే రికార్డులు చూపించాలని సవాల్ చేశారు. తనకు తల్లిదండ్రులు మహిళలను గౌరవించడం నేర్పారని, ఎల్లప్పుడూ “మేడమ్”, “గారు” అని సంబోధించానని గుర్తుచేశారు. అదే సమయంలో, గతంలో తన తల్లి అవమానించబడినప్పుడు వైసీపీ నేతలు మౌనం వహించారని గుర్తుచేస్తూ, మహిళల గౌరవం విషయంలో ఆ పార్టీకి చులకన ధోరణి ఉందని తీవ్రంగా విమర్శించారు.
ఇక ఈ వాదనల నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీశాయి. లోకేష్ ఉపయోగించని మాటలను ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. దీనిపై హోంమంత్రి అనిత ఘాటుగా స్పందించి, బొత్స వెంటనే క్షమాపణ చెప్పి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం రాజకీయ వేదికగా మారడమే కాకుండా, మహిళల గౌరవం చుట్టూ కొత్త రాజకీయ చర్చలు మొదలైనట్టు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనుంది.