Nadendla Manohar : ఈ సారి కూడా పోటీ చేసేది అక్కడ్నుంచే.. క్లారిటీ ఇచ్చిన జనసేన నాదెండ్ల మనోహర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి ఎక్కడ్నుంచి పోటీ చేస్తాడో ఇంకా చెప్పలేదు. కానీ తాజాగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) మాత్రం తను ఎక్కడ్నుంచి పోటీ చేస్తాడో క్లారిటీ ఇచ్చాడు.
- Author : News Desk
Date : 07-08-2023 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ(AP)లో మరి కొన్ని నెలల్లో ఎలక్షన్స్(Elections) రాబోతున్నాయి. పార్టీల మధ్య వాదోపవాదాలు, ఒకరిపై ఒకరు విమర్శలు సాగుతూనే ఉన్నాయి. ఈ సారి జనసేన(Janasena) కీలక పాత్ర వహించబోతుందని ఇప్పటికే అందరికి అర్థమైంది. వైసీపీ(YCP) సింగిల్ గానే పోటీ చేస్తుంది. జనసేన బీజేపీ(BJP)తో పొత్తు ఉన్నా టీడీపీ(TDP)తో మాత్రం సంగతేంటని చెప్పట్లేదు. కానీ వైసీపీ మళ్ళీ రాకుండా ఉండటానికి ఏమైనా చేస్తానని పవన్ చెప్తూ వస్తున్నాడు.
ఇక అన్ని పార్టీలు ఇప్పట్నుంచే అభ్యర్థుల్ని ఫైనల్ చేస్తున్నాయి. జనసేనకు అన్ని చోట్ల పోటీ చేయడానికి అభ్యర్థులు లేరన్న మాట ఒప్పుకోక తప్పదు. పొత్తులలో కొన్ని చోట్ల మాత్రం కచ్చితంగా నిలబెడతారు. అసలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి ఎక్కడ్నుంచి పోటీ చేస్తాడో ఇంకా చెప్పలేదు. కానీ తాజాగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) మాత్రం తను ఎక్కడ్నుంచి పోటీ చేస్తాడో క్లారిటీ ఇచ్చాడు.
తాజాగా గుంటూరులో జరిగిన జనసేన మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం అన్ని జిల్లాల్లో కార్యకర్తలతో సమీక్షలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై పోరాడుతున్న పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా అందరూ నిలబడ్డారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోవాలనే జనసేన పోరాడుతుంది. వాలంటీర్ల ద్వారా పవన్ కల్యాణ్ పై అక్రమంగా కేసులు పెట్టించారు. ఆయన వాలంటీర్ల ద్వారా వ్యవస్థకు జరుగుతున్న నష్టాలను ప్రజలకు తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో జరుగుతున్న డేటా చోరీ గురించి ప్రజలకు తెలుపుతున్నందుకు వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. గుంటూరుకు మీరేం చేశారు. పులిచింతలలో గేటు పోతే ఇంతవరకు దిక్కులేదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో విచ్చలవిడిగా డబ్బులు చేతులు మారుతున్నాయి. దీనిపై విచారణ కమిటీ వేయాలి. గుంటూరు జిల్లాలో సమస్యలపై జనసేన పోరాటాలు చేస్తుంది అని తెలిపారు.
ఇక ఎన్నికల్లో తన పోటీ గురించి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక చక్కని మార్గాన్ని వేసుకునేందుకు అధినేత ఆదేశాల మేరకు పని చేస్తాం. నేను రాబోయే ఎన్నికల్లో కూడా తెనాలి నుండి పోటీ చేస్తాను. రాష్ట్రంలో ఎన్ని చోట్ల జనసేన పోటీ చేస్తుందో త్వరలోనే చెప్తాము. అక్కడ కూడా ఎవరెవరు పోటీ చేయబోతున్నారో తెలియచేస్తాము అని తెలిపారు. గతంలో జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచే పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఈసారి కూడా తెనాలి నుంచే పోటీ చేస్తాను అని చెప్పడంతో తెనాలిలో రాజకీయ చర్చలు మొదలయ్యాయి.
వైసీపీ నుంచి ప్రస్తుతం అన్నాబత్తుని శివ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నారు. పొత్తు లేకపోతే ఎవరికి వాళ్ళే పోటీ చేస్తారు. మరి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆలపాటి ఆగుతాడా, నాదెండ్ల ఆగుతాడా చూడాలి.
Also Read : Employees Fight : వై నాట్ CPS దిశగా ఉద్యోగుల ఉద్యమబాట