పిల్లలతో అలాంటి పనులేంటి జగన్ – మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
YCP బాధ్యత లేని పార్టీగా తయారైందని మంత్రి అనిత మండిపడ్డారు. యువకులను రౌడీమూకలుగా మారుస్తోందని ఆరోపించారు
- Author : Sudheer
Date : 22-12-2025 - 3:15 IST
Published By : Hashtagu Telugu Desk
- వైసీపీ పార్టీ పై మంత్రి అనిత నిప్పులు
- వైసీపీ బాధ్యత లేని పార్టీ
- యువకులను రౌడీమూకలుగా జగన్ మారుస్తున్నాడు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత లేని రాజకీయ పక్షంగా మారిందని హోం మంత్రి అనిత గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా యువతను పక్కదారి పట్టిస్తూ, వారిని రౌడీ మూకలుగా మార్చేలా ఆ పార్టీ చర్యలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. సమాజంలో ఆదర్శంగా నిలవాల్సిన యువతను రాజకీయ ప్రయోజనాల కోసం హింసాత్మక ధోరణి వైపు మళ్లించడం రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ, వ్యక్తుల ప్రవృత్తిని నేరపూరితం చేయడం అన్యాయమని ఆమె అభిప్రాయపడ్డారు.

Anitha Fire Ycp
రాష్ట్రంలో ఇటీవల కనిపిస్తున్న కొన్ని అవాంఛనీయ ఘటనలను మంత్రి ఉదహరిస్తూ వైసీపీ తీరును తప్పుబట్టారు. చిన్న పిల్లలతో సైతం అభ్యంతరకరమైన స్లోగన్లతో ఫ్లెక్సీలు కట్టించడం, మేక తలలు నరికి రక్తాభిషేకాలు చేయడం వంటి చర్యలు సమాజంలో నేర ప్రవృత్తిని పెంచుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి వికృత చేష్టలు కేవలం భయాందోళనలు సృష్టించడానికేనని, ఇలాంటి రౌడీ మూకల ఆగడాలను ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని ఆమె హెచ్చరించారు.
శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరబోతున్న కానిస్టేబుళ్లకు మంత్రి అనిత గారు కీలక సూచనలు చేశారు. పోలీస్ యూనిఫామ్ అనేది కేవలం ఒక దుస్తులు మాత్రమే కాదని, అది సమాజం పట్ల ఉన్న ఒక గొప్ప బాధ్యత అని ఆమె గుర్తు చేశారు. ప్రతి పోలీస్ అధికారి పూర్తి నిబద్ధతతో, పారదర్శకతతో పని చేయాలని కోరారు. రౌడీయిజాన్ని అణచివేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషించాలని, ప్రజలకు భద్రత కల్పించడమే ప్రథమ కర్తవ్యంగా భావించాలని ఆమె పిలుపునిచ్చారు. చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపించేలా పోలీసుల పనితీరు ఉండాలని ఆమె ఆకాంక్షించారు.