Fees of Private Schools : ప్రైవేట్ పాఠశాలల ఫీజు నియంత్రణ పై లోకేష్ క్లారిటీ
Fees of Private Schools : ఇక ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంపై కొత్త కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా వన్ క్లాస్ వన్ టీచర్ విధానంను విస్తృతంగా అమలు చేయడం ప్రారంభమైంది
- By Sudheer Published Date - 01:50 PM, Tue - 23 September 25

ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు (Fees of Private Schools) నియంత్రణపై మండలిలో ప్రశ్నలు లేవనెత్తగా, ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 2019లోనే APSERMC చట్టంను తీసుకువచ్చారని, కానీ ఆ చట్టానికి సంబంధించిన అంశాలు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున నిర్ణయాత్మక చర్యలు ఆలస్యమవుతున్నాయని స్పష్టంచేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేయడాన్ని నియంత్రించేందుకు చట్టపరమైన విధానాలు అవసరమని ప్రభుత్వం గుర్తిస్తోంది. ఈ అంశంపై తుది తీర్పు వచ్చిన తరువాత మాత్రమే స్పష్టమైన అమలు చర్యలు చేపట్టనున్నట్లు సంకేతాలు ఇస్తోంది.
AP Fee Reimbursement Dues: ఫీజు రీయింబర్స్ బకాయిలపై వైసీపీ దుష్ప్రచారానికి నారా లోకేష్ కౌంటర్
ఇక ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంపై కొత్త కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా వన్ క్లాస్ వన్ టీచర్ విధానంను విస్తృతంగా అమలు చేయడం ప్రారంభమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో 117వ జీవో ప్రకారం కేవలం 1,200 పాఠశాలల్లో మాత్రమే ఈ విధానం అమల్లో ఉండగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు 9,600 ప్రాథమిక పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున అమలు చేయని విప్లవాత్మక చర్యగా చెప్పవచ్చు. చిన్నారులు ఒకే క్లాస్లో మిళిత బోధనలో కాకుండా, ప్రత్యేకంగా ప్రతి తరగతికి ప్రత్యేక ఉపాధ్యాయుడి ద్వారా పాఠాలు నేర్చుకునే అవకాశం కలుగుతుంది.
ప్రభుత్వం మరో ముఖ్య లక్ష్యంగా గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ (Foundational Literacy and Numeracy)ను సాధించడానికి కృషి చేస్తోంది. ప్రాథమిక స్థాయిలోనే చదవడం, రాయడం, లెక్కించడం వంటి ప్రాథమిక నైపుణ్యాల్లో ప్రతి విద్యార్థి బలపడేలా చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యల వల్ల ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల నమ్మకం పెరిగే అవకాశం ఉంది. విద్యలో సమానత్వం, నాణ్యత, పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు రాష్ట్ర విద్యా రంగానికి కొత్త దిశను చూపుతున్నాయి అని తెలుస్తుంది.