Lokesh Hunger Strike : రేపు ఢిల్లీలో లోకేష్ నిరాహారదీక్ష.. చంద్రబాబు, భువనేశ్వరి దీక్షకు సంఘీభావం
Lokesh Hunger Strike : ఏపీలో సాగుతున్న అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు (సోమవారం) గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు.
- By Pasha Published Date - 11:04 AM, Sun - 1 October 23

Lokesh Hunger Strike : ఏపీలో సాగుతున్న అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు (సోమవారం) గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అక్టోబరు 2న జైలులో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు, రాజమండ్రిలో నారా భువనేశ్వరి చేపట్టనున్న దీక్షకు మద్దతుగా అదే రోజు తాను ఢిల్లీలో నిరాహార దీక్షకు దిగుతానని లోకేష్ ప్రకటించారు. ఢిల్లీలోని టీడీపీ ఎంపీ కనకమేడల నివాసంలో లోకేశ్ దీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ దీక్షలో టీడీపీ ఎంపీలు కూడా పాల్గొనబోతున్నారు. చంద్రబాబు జైలులో నిర్వహిస్తున్న దీక్షకు సంఘీభావంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో దీక్షలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రేపు (సోమవారం) సాయంత్రం 7 గంటలకు ఐదు నిమిషాల పాటు ఇంట్లోని లైట్లన్నీ ఆర్పేసి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని వెల్లడించింది.
Also read : World Cup 2023: ‘జ్యూవెల్ ఆఫ్ నైజాం’లో పాక్ ఆటగాళ్ల డిన్నర్ , వీడియో వైరల్
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా నిరాహార దీక్ష చేస్తారని శనివారం రాత్రి టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. అక్టోబర్ 2న చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి రాజమండ్రిలో నిరాహార దీక్ష చేస్తారని శనివారం ఉదయం బాలకృష్ణ ప్రకటించారు. మరోవైపు ఈరోజు నుంచి పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రకు కూడా టీడీపీ మద్దతు ఇస్తోంది. ఈ యాత్రలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సంపూర్ణంగా (Lokesh Hunger Strike) పాల్గొనబోతున్నారు.