AP Drought Mandals: ఏపీలో తక్కువ వర్షపాతం నమోదైన కరువు మండలాల జాబితా విడుదల!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్కు సంబంధించిన కరవు మండలాల జాబితాను విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల సీజన్లో ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలను కరవు ప్రభావితంగా గుర్తించినట్లు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షపాతం పడినా, కొన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
- By Kode Mohan Sai Published Date - 10:52 AM, Wed - 30 October 24

AP Drought Mandals: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన కరవు మండలాల జాబితాను విడుదల చేసింది. ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలు కరవు ప్రభావితంగా గుర్తించబడ్డాయి. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఈ మండలాలు కరవు బాధితంగా ఉన్నాయని రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. మిగిలిన 21 జిల్లాల్లో కరవు పరిస్థితులు లేనట్లు నివేదికలు అందాయి. ఈ 54 మండలాల్లో 27 మండలాలు తీవ్రంగా కరవు ప్రభావానికి గురయ్యాయన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఈ కరవు మండలాలను నోటిఫై చేస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అధిక వర్షపాతం నమోదైనప్పటికీ, సగటు వర్షపాతం కంటే తక్కువగా నమోదైన మండలాలను కరువు మండలాలుగా గుర్తించారు. అనంతపురం జిల్లాలో 56.4%, శ్రీ సత్యసాయి జిల్లాలో 52.7%, అన్నమయ్య జిల్లాలో 46.6%, చిత్తూరు జిల్లాలో 45.4% మరియు కర్నూలు జిల్లాలో 18.2% వరకు సాధారణానికి కంటే తక్కువ వర్షం పడింది. 2023 ఖరీఫ్లో 88.55 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయగా, 2024 ఖరీఫ్లో రైతులు 93.55 లక్షల ఎకరాల్లో పంటలు సాగించారు. ఏపీ లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 114.72 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణంలో 82% విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు.
చిత్తూరు జిల్లా పెనుమూరు, గుడిపాల, యాదమర్రిని తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించారు. అలాగే, చిత్తూరు జిల్లా చిత్తూరు, పూతలపట్టు, కుప్పం, రామకుప్పం, సోమల, పుంగనూరు, పలమనేరు, శాంతిపురం, శ్రీరంగరాజపురం, రొంపిచర్ల, బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, గుడుపల్లె మద్యస్థ కరువు మండలాలుగా గుర్తించారు. అనంతపురం జిల్లా నార్పల, అనంతపురం తీవ్ర కరువు మండలాలు, విడపనకల్, యాడికి, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, రాప్తాడు కరువు మండలాలుగా ప్రకటించబడ్డాయి. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ, తలుపులను తీవ్ర కరువు మండలాలుగా గుర్తించారు, కనగానపల్లి, ధర్మవరం, నంబులపులకుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, రామగిరి, పరిగిని కరువు మండలాలుగా ప్రకటించారు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె, రాయచోటి, పీలేరు, గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లి, టి.సుండుపల్లె, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, వీరబల్లె, గుర్రంకొండ, కలకడ, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కురబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లె, కర్నూలు జిల్లా కౌతాళం, పెద్ద కడుబూరు కరువు మండలాలుగా ప్రకటించారు.