Kunki Elephants: కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం.. డిప్యూటీ సీఎం పవన్ హర్షం!
ఈ ఆపరేషన్ విజయవంతం కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను, మావటిలను, కావడిలను అభినందించారు.
- By Gopichand Published Date - 09:52 PM, Mon - 4 August 25

Kunki Elephants: ఆంధ్రప్రదేశ్లో అటవీ ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు ప్రారంభించిన ‘ఆపరేషన్ కుంకీ’ విజయవంతంగా తొలి అడుగు వేసింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి వద్ద పంట పొలాలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపును కుంకీ ఏనుగులు (Kunki Elephants) విజయవంతంగా అడవిలోకి తరిమికొట్టాయి. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
ఆపరేషన్ వివరాలు
మొగిలి ప్రాంతంలో గత 15 రోజులుగా ఏనుగులు సంచరిస్తున్న సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ ఆపరేషన్ చేపట్టారు. కర్ణాటక నుంచి తీసుకువచ్చిన కుంకీ ఏనుగులు కృష్ణ, జయంత్, వినాయక ఈ ఆపరేషన్లో చురుగ్గా పాల్గొన్నాయి. ముఖ్యంగా కృష్ణ అనే ఏనుగు తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, అడవి ఏనుగులను పంటల వైపు రాకుండా అడ్డుకుని, తిరిగి అడవిలోకి పంపించడంలో కీలక పాత్ర పోషించిందని అటవీ అధికారులు తెలిపారు.
Also Read: Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోస్ కమిషన్ నివేదిక.. కేసీఆర్పై తీవ్ర ఆరోపణలు!
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు
ఈ ఆపరేషన్ విజయవంతం కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను, మావటిలను, కావడిలను అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ప్రజల ప్రాణాలను, రైతుల పంటలను ఏనుగుల గుంపుల నుండి కాపాడేందుకు కట్టుబడి ఉందని ఈ ఆపరేషన్ నిరూపించిందని ఆయన అన్నారు. అలాగే, కుంకీ ఏనుగులను వెంటనే ఇచ్చి సహకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆపరేషన్ కుంకీతో సరిహద్దు ప్రాంత రైతులకి భరోసా
• కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం
• పంటల్ని ధ్వంసం చేస్తున్న ఏనుగుల్ని.. కుంకీలు దారి మళ్లించాయి
• తొలి ఆపరేషన్ విజయవంతం చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలురాష్ట్రంలో ఆపరేషన్ కుంకీ మొదలయ్యింది. కుంకీ ఏనుగులు ద్వారా…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) August 4, 2025
తదుపరి ప్రణాళికలు
కుంకీ ఏనుగులకు రెండు నెలల శిక్షణ ఇచ్చిన తర్వాత చేపట్టిన ఈ తొలి ఆపరేషన్ విజయవంతం కావడంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలకు, రైతులకు ఒక భరోసా లభించింది. తదుపరి ఆపరేషన్ పుంగనూరు అటవీ ప్రాంతంలో చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆపరేషన్లు సరిహద్దు జిల్లాలలోని ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారంగా నిలుస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.