YSRCP Politics : వైసీపీ కుమ్ములాట! 13 జిల్లాల చిత్రం !!
శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకూ జగన్ పాలన మీద వ్యతిరేకత వ్యక్తం అవుతోందని టీడీపీ అంచనా వేస్తోంది. పెరిగిన ధరలు, అధ్వాన రోడ్లు, చెత్త పన్నులు, ఓటీఎస్, కానరాని అభివృద్ధి, ఏరులై పారుతున్న మద్యం ఒకటేమిటి ప్రభుత్వం తలపెట్టిన ప్రతీపనీ ప్రజలకి భారంగా మారింది.
- By CS Rao Published Date - 04:30 PM, Mon - 3 January 22
శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకూ జగన్ పాలన మీద వ్యతిరేకత వ్యక్తం అవుతోందని టీడీపీ అంచనా వేస్తోంది. పెరిగిన ధరలు, అధ్వాన రోడ్లు, చెత్త పన్నులు, ఓటీఎస్, కానరాని అభివృద్ధి, ఏరులై పారుతున్న మద్యం ఒకటేమిటి ప్రభుత్వం తలపెట్టిన ప్రతీపనీ ప్రజలకి భారంగా మారింది. ఇదే సమయంలో వైసీపీలోని అంతర్గత కుమ్ములాటలు రాబోయే రోజుల్లో కలిసివస్తాయని టీడీపీ అంచనా వేస్తోంది. ఆయా జిల్లాలోని గ్రూప్ విభేదాలు వైసీపీ అధిష్టానంకు తలనొప్పిగా మారింది.ప్రకాశం జిల్లాలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పూర్తిగా పార్టీకి దూరం ఉంటున్నాడు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి వైసీపీతో సంబంధమే లేనట్టు వ్యవహరిస్తున్నాడు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు గన్మెన్లను సరెండర్ చేసి ఫోన్లకి కూడా అందుబాటులో లేకుండా వెళ్లిపోయాడు. చీరాలలో టిడిపి నుంచి వచ్చిన కరణం బలరాం..అంతకుముందే వైసీపీలో ఉన్న ఆమంచి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇక జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన బావమరిది బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య వైరం చాపకింద నీరులా పార్టీని నష్ట పరుస్తోంది. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఏ క్షణంలోనైనా రాజీనామా చేయడానికి అవకాశం ఉందని వైసీపీ వర్గాల టాక్.
చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డిని ప్రశ్నిస్తే చాలు సొంత పార్టీ వారైనా లోపలేయిస్తున్నారని వైసీపీ జెడ్పీటీసీ భర్త కొండ్రెడ్డి రోడ్డెక్కారు. నియోజకవర్గం మొత్తం వైసీపీ నేతలదీ ఇదే మాట. పెద్దిరెడ్డి బస్సుల్లో ఓట్లు తరలించినా వారితో ఓట్లేయించేది మేమేనంటూ తొడగొడుతున్నారు.నగరి ఎమ్మెల్యే రోజాది మరీ దారుణమైన పరిస్థితి. తనకు పోటీగా ఎదుగుతున్నారని వైసీపీ నేతల్ని సస్పెండ్ చేయిస్తే, వారు పెద్దిరెడ్డి ఆశీస్సులతో సొంతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిపై రోజా ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు మధ్య వైరం తీవ్రం అవుతోంది. ఎంపీ రంగయ్య, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ మధ్య గొడవలు ముదిరి పాకానపడ్డాయి. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పదవులు అమ్ముకున్నారని వైసీపీ నేతలే ఆరోపించడంతో వివాదాలు బయటపడ్డాయి. నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి… తమ ప్రభుత్వ పాలనలో లోకల్ మాఫియాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలకు- మంత్రి అనిల్కుమార్ యాదవ్కి అస్సలు పొసగడంలేదట. గూడురు, ఉదయగిరి నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని.. సెకండ్ క్యాడర్ నేతలు తరచూ ఆరోపణలకు దిగుతున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంటకి మధ్య వివాదం కేసుల వరకూ చేరింది.
గుంటూరు జిల్లాలో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినితో విభేదాలు తీవ్రమయ్యాయి. కృష్ణదేవరాయలు పూర్తిగా పార్టీకి దూరమయ్యే ఆలోచనలో వున్నారని సమాచారం. వైసీపీలో మొదటి నుంచీ ఉన్న మర్రి రాజశేఖర్ వైరాగ్యంతో తిరిగి న్యాయవాదిగా ప్రాక్టీసుకి వెళ్లిపోయాడు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, బాపట్ల ఎంపీ సురేష్ మధ్య వాటాల తేడాతో గొడవలు ముదిరి రోడ్డునపడ్డాయి. శ్రీదేవిని హైదరాబాద్కే పరిమితం కావాలని అధినేత ఆదేశించారని వైసీపీలో గుసగుసలు. కృష్ణా జిల్లాలో వైసీపీలో చేరిన టిడిపి నేతల మధ్య విభేదాలతో ఒకరినొకరు దెప్పిపొడుచుకుంటున్నారు. పాతతరం పాలిటిక్స్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారట. కొడాలి నాని, వల్లభనేని వంశీలు….దేవినేని అవినాష్ని టార్గెట్ చేసినట్టు అర్థం అవుతోంది. వంగవీటి రాధ హత్యకి అవినాష్ ఆంతరంగికుడు అరవ సత్యం రెక్కీ నిర్వహించాడని సోషల్ మీడియా కథనాలు వెల్లువెత్తాయి. దీంతో పార్టీలో లుకలుకలు బయటపెట్టింది ఆ ఘటన. మరోవైపు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.పశ్చిమగోదావరి జిల్లాలో ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే ఎలీజా మధ్య ఉన్న గ్యాప్ స్థానికసంస్థ ఎన్నికల్లో బట్టబయలైంది. మంత్రి ఆళ్లనానితోనూ ఎమ్మెల్యేలు, నేతలకు బాగా దూరం పెరిగింది.
తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య వివాదం రాజుకుంది. ఒకరినొకరు ఎప్పుడు దెబ్బకొట్టుకుందామా అని ఎదురు చూస్తున్నారట.విశాఖలో విజయసాయిరెడ్డి దెబ్బకి వైసీపీ నేతలు పూర్తిగా తెరమరుగయ్యారు. ఇటీవలే వైసీపీ జెండా కప్పుకున్న వాసుపల్లి గణేష్ అలకబూనారు. మంత్రి అవంతి తీవ్ర అసంతృప్తితో వున్నారని ఆయన వర్గీయుల నుంచి వినికిడి. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకి స్థానిక వైసీపీ నేతలకి మధ్య చాలారోజుల్నించి వివాదాలు నడుస్తూనే వున్నాయి.శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కృష్ణదాసు వర్గం, తమ్మినేని వర్గం, సీదిరి స్వతంత్రంగా రాజకీయాలు చేస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ…ఇది మునిగిపోయే పడవ…మీ దారి మీరు చూసుకోండని అనుచరులకు చెబుతున్నారని సమాచారం.విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ హవాకి అడ్డుకట్ట వేయడానికి ఆయన మేనల్లుడు చిన్నశ్రీను తెరపై కనిపిస్తున్నాడు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులతో ఆయన దూకుడుగా ఉన్నాడట. ఫలితంగా ఒకే ఇంట్లో రెండు కుంపట్లులా రాజుకుంటోంది రాజకీయం. మొత్తం మీద రాష్ట్రంలో 13 జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల నుంచి గ్రామస్థాయి వరకూ గ్రూపులుగా వైసీపీ వర్గపోరాటం కనిపిస్తోంది. ఇదంతా అధిష్టానంకు తెలిసినప్పటికీ పెద్దగా పట్టించుకోవడంలేదని పార్టీ వర్గాల్లో ఉంది. దీంతో గ్రూపుల పోరు క్రమంగా అన్ని చోట్లా తారాస్థాయికి వెళ్లింది. .
Related News
Bharathi Reddy : భారతి రెడ్డే కాదు.. నీ దగ్గర సమాధానం ఉన్న చెప్పు జగన్..?
ఏపీలో ఎన్నికల వేళ తమ వారిని గెలిపించుకునేందుకు నడుం బిగించి ప్రచారంలో పాల్గొంటున్నారు కుటుంబ సభ్యులు.