CM KCR: కేసీఆర్ ఆంధ్రావస్తుంటే రాద్ధాంతం ఎందుకు ?
చరిత్ర సృష్టించాలి అనుకునే వారు , వారే దారులు వెదుక్కోవాలి.
- By CS Rao Published Date - 07:00 PM, Sat - 7 January 23
చరిత్ర సృష్టించాలి అనుకునే వారు , వారే దారులు వెదుక్కోవాలి. తెలంగాణాలో కెసిఆర్ కు అనుకూలంగా చాప కింద నీరులా అనేక సాంస్కృతిక సంఘాలు నేటికీ పనిచేస్తూనే ఉన్నాయి . వారిని ఆర్ధికంగా ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తున్నాడు కెసీఅర్. కానీ చంద్రబాబుకు అవేమీ పట్టవని , ఓడిపోయి ఖాళీగా ఉండే సమయంలో కార్యకర్తలను దేవుళ్ళు అంటాడని , వారి త్యాగాలు మరువలేనివి అంటాడని , అందలం ఎక్కాక కాడి పారేస్తాడనే అపవాదు ఉంది. ఇక నుండీ కొత్త చంద్రబాబును చూస్తారు అంటూ కార్యకర్తలను రెచ్చగొడు తున్నాడని , ఒకవేళ అధికారం లోకి వస్తే యధా ప్రకారమే నిబంధనలు , గుడ్డూ – గూసు అంటాడని చెప్పుకొస్తున్నారు.
బి.ఆర్.ఎస్ పార్టీగురించి ఆంధ్రా ప్రజానీకం , ముఖ్యంగా టి.డి. పి వారు కెసిఆర్ రాష్ట్రానికి చేసిన , చేస్తున్న , చేయబోయే నష్ఠాలను మాత్రమే ఎండగట్టాలి. వ్యక్తిగత ధూషణలు , తలా తోక లేని ఆరోపణలు చెయ్యకూడదు . దానివల్ల లాభం కన్నా నష్ఠమే ఎక్కువ . బి.ఆర్.ఎస్ ఆంధ్రా లో స్థాపిస్తే ఏ మవుతుంది ? పార్టీ పెట్టుకునే స్వేచ్చ ప్రతి వారికీ ఉంటుంది . క్రేజీవాల్ , బి.యస్.పి లాంటి బైటి వారు పార్టీలు పెట్టుకోగా లేనిది తెలుగువాడైన కె.సి.ఆర్ పార్టీ పెట్టుకోవడం తప్పు ఎలా అవుతుంది ? ఆంధ్రులు దాన్ని స్వాగతించాలి. దాని వల్ల ఆంధ్రా పార్టీలు కూడా తెలంగాణాలో చొచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. ఇక వైసిపి వారు బి.ఆర్. ఎస్ ను విమర్శిస్తూ ప్రకటనలు ఇస్తున్నారు. ఇది కావాలనే వ్యూహాత్మకంగా విమర్శలో ఒక భాగమే. బి ఆర్ ఎస్ , వై సి పి కూడబలుక్కుని ఆడే డ్రామా గానే భావించాలి.
బి జె పి , బి ఆర్ ఎస్ , వై సి పి వీరందరిదీ ఒకే భావజాలం. పైకి విరోధుల్లాగా నటిస్తారు , లోపాయికారిగా ఒకరి కొకరు సహరించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఓటర్లలో కాపుల సంఖ్య బలీయంగా ఉంది . గతంలో ఎ.పి లో వారొక నాయకుణ్ణి నమ్మడం వల్ల ఓట్లు చీలి కాంగ్రెస్ కు మేలు జరిగింది. తరువాత ఆ నేత దుకాణం సర్దేశాడు. మరలా 2014 లో కొత్త రాష్ట్రం ఏర్పడింది , చంద్రబాబు అయితే పాలనను గాడిలో పెట్టగలడని కొద్దిమంది ఓటర్లు , తటస్థ ఓటర్లు టిడిపి కి మొగ్గు చూపడంతో అది ప్రభుత్వాన్ని ఏర్పరచింది . మరలా కాపు వర్గం నుండీ మరో నటుడు బైటకు వచ్చి టి డి పి కి మద్దతు ఇవ్వడం , బిజెపి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక్కడే చంద్రబాబు బొక్క బోర్లా పడింది. కులాలు , మతాలకు ప్రాధాన్యత నిచ్చే ఆంధ్రులను తన పని విధానంతో మెప్పించవచ్చని అనుకున్నాడు చంద్రబాబు. కానీ ప్రజలకు ఇంకా ఏదో కావాలి , దాన్ని అందుకోలేక పోయాడు చంద్రబాబు. అదే కె సి ఆర్ రైతు బందు , రైతు భీమా, 24 గం.ల విద్యుత్తు , డబుల్ బెడ్ ఇళ్ళు , సొంత స్థలం ఉంటే నేరుగా 3 లక్షలు అందించడం, సాగునీటి పధకాలు, త్రాగునీటి పధకాలు , దళిత బంధు లాంటివి అమలు చేసాడు . వీటి అన్నింటా నీతా , అవినీతా అని చూడకుండా నిధులు మంజూరు చేస్తూ ముందుకు చొచ్చుకుపోయి తన అధికారాన్ని సుస్థిర పరచుకున్నాడు. అదే చంద్రబాబు రైతు రుణమాఫీ ని పూర్తిగా అమలు చేయలేక పోయాడు. కొంత మేర లబ్ధి పొందిన వర్గాలు వైసిపి ఒక్కసారి నినాద మాయలో పడ్డారని చెబుతారు గానీ కావాలనే వారు వైసిపి కి ఓట్లు వేసారు. ఇరవై లక్షల ధర పలికే భూమి ఐదారు కోట్లు పలికిన అమరావతి ప్రాంతంలో కూడా టిడిపి ఓటమి చెందింది.
ఇదంతా మోసపోయి ఓట్లు వేయడం కాదు. పించన్ రెండు వేలను నాలుగు వేలు చేస్తాడని , అమరావతి భూములు ఐదు కోట్లవి , పది కోట్లు అవుతుందనే దురాశతో వేసారు. చంద్రబాబు ప్రత్యేక పాకేజీకి ఆమోదించడం మొదటి తప్పు. పొగబెట్టే దాగా వేచి ఉండడం రెండవ తప్పు . బిజెపి పెద్దలు వై.సి.పి తో కల్సి అడుగులు వేస్తుంటే చూస్తూ, నిలువరించ లేక పోవడం , ఎదురు దాడి చేయలేక , తెగే దాకా సాగదీయడం ఇవన్నీ వ్యూహాత్మక తప్పిదాలే. ఓటుకు నోటు కేసు , వైసిపి – బిజెపి – టి ఆర్ ఎస్ ల లోపాయి కారీ పొత్తును గుర్తించలేక పోవడం ఇంటిలిజన్స్ వైఫల్యం కాదా ? ఒకవేళ గుర్తించినా ఆ పొత్తును ప్రజాక్షేత్రంలో ఎండగట్ట లేక పోవడం మరో తప్పుకాదా ? ఇలా పదేపదే వ్యూహాత్మక తప్పులు చేస్తుం డడం వల్ల చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది. సరే బాబుకు అధికారం పోతే పోయింది , రాష్ట్రం అధోగతి పాలయ్యింది. కాపు సామాజిక వర్గంలో చీలిక కోసమే బి.ఆర్.ఎస్ , వైసిపి , బిజెపి నాటకాలు ఆడుతున్నాయని , 2019 లో కె.సి.ఆర్ ప్రభుత్వం నేరుగా ఆంధ్రా వై.సి.పి అభ్యర్ధులకు ఆర్ధిక సాయం వందల కోట్ల మేర చేసిందని , దానికి ప్రతిగా అందలం ఎక్కిన వైసిపి ప్రభుత్వం హైద్రాబాద్ లోని , ఢిల్లీ లోని ఎ.పి ఆస్తులు , పోలవరం ఎత్తు తగ్గించడం , మిగులు జలాలు , తెలంగాణా సాగునీటి పధకాలపై సరైన వాదనలు వినిపించక పోవడం , విద్యుత్ బకాయిలు అడగకపోవడం లాంటివి చాలా చేసిందని, రేపు ముందస్తుకు తెలంగాణా, ఎ.పి ఎవ్వరు వెళ్ళినా మరలా సహకారం ఇచ్చుకుంటారని , ఎ.పి లో బి.ఆర్.ఎస్ సారధ్యం కాపు నేతకు ఇవ్వడం వెనుక నాలుగు వేల కుంభకోణం ఉందని ఎ.పి కాపు నేత చేగొండి హరిరామ జోగయ్య బహిరంగంగా ప్రకటించాడు. ఒక పక్క దేవినేని అవినాష్ ని అక్కున చేర్చుకుని సీటు ఖాయం చేసింది వై.సి.పి . మరో పక్క కమ్మ సామాజిక వైసిపి నేతలు వెళ్ళి వంగవీటి రాధాను దువ్వుతూ ఉంటారు. మరోపక్క జనసేన పార్టీ నేత బిజెపి రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నా అంటాడు , తెలంగాణాలో బిజెపి వారు బండి సంజయ్ దూసుకు వెళ్ళే అవకాశం ఇస్తున్నారు.
వీటన్నిటినీ గమనిస్తుంటే కాపుల ఓట్ల చూట్టూనే రాజకీయం నడుపుతున్నట్లు కనిపిస్తోందని , టిడిపి , జనసేన ఎక్కడ జట్టు కడతాయోనని అన్ని పార్టీలు భయపడుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఎవరు తమకు న్యాయం చెయ్యగలరో , గతంలో ఎవరు మేళ్ళు చేసారో గుర్తించుకో వలసింది కాపులే అని కూడా చెబుతున్నారు. సరైన నిర్ణయం తీసుకోకపోతే కాపుల వల్లే రాష్ట్రం దెబ్బతినింది అనే అపవాదును మోయవల్సి వస్తుంది అని కూడా చెబుతున్నారు. వీటిని గుర్తించిన గ్రామస్థాయి కాపులు , జనసేన కార్యకర్తలు టిడిపి తో ఇప్పటికే కల్సి పనిచేసుకుంటూ వెళుతున్నారని , పై స్థాయిలో దోబూచులాట సాగుతోందని చర్చించు కుంటున్నారట. వైసిపి లో కాపు నాయకులు మాత్రమే ఉన్నారని కాపు ఓటర్లు టిడిపి వైపు చూస్తున్నా రనే ప్రచారం ముమ్మరంగ సాగుతోందట. టిడిపి మౌనం వ్యూహాత్మక మౌనమా , రాజకీయ అవగాహనా లోపమా అర్ధం కావడం లేదని కొందరు తటస్థులు భావిస్తున్నారు. పార్టీ పెట్టవద్దు అనేది మనమెందుకు అనాలని, ఎ.పి లో కాంగ్రెస్ , బిజెపి లకు ఏ గతి పట్టించారో బి.ఆర్.ఎస్ కు అదే గతి పడుతుందనేది కొందరి వాదనగా ఉంది .
Related News
Hyderbad: బాబా ఫసియుద్దిన్ పై పోలీసులకు ఫిర్యాదు
Hyderbad: బీఅర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి రోడ్ షో మీద షూ విసిరింది బాబా ఫసియుద్దిన్ అంటూ బోరబండ పోలీసులకు బీ అర్ ఎస్ నేతల ఫిర్యాదు చేశారు. బోర బండ లో ఈనెల 9 న ఎమ్మెల్యే మాగంటి రోడ్ షో మీద షూ దాడి ఘటన జరిగిందని, కార్పొరేటర్ బాబా ఫసియుద్దున్ తదితరుల మీద చర్యలు తీసుకోవాలి అని బోర బండ పోలీసులతో పాటు నగర పోలీస్ కమిషనర్ కు బీ అర్ ఎస్ నాయకుల […]