Vangalapudi Anitha : జగన్ జాగ్రత్త అంటూ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక
జగన్ మాత్రం 36 రాజకీయ హత్యలు జరిగాయని ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు. అదే నిజమైతే జగన్ ప్రభుత్వానికి ఆయా హత్యల వివరాలు ఇవ్వాలన్నారు
- By Sudheer Published Date - 05:09 PM, Sun - 21 July 24

ఏపీలో శాంతి భద్రతల అంశంపై మాజీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్తే, తానూ ఢిల్లీ వెళ్లి తేల్చుకునేందుకు సిద్ధమని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సవాల్ చేశారు. కూటమి సర్కార్ (AP NDA) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని.. దీనిపై ఢిల్లీ వేదికగా ధర్నా (Jagan Dharna) చేయనున్నట్లు మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జులై 24వ తేదీన ఢిల్లీలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేస్తానని.. అనంతరం ప్రధాని మోడీ (PM Modi)ని కలిసి ఏపీలో నెలకొన్న భయానక పరిస్థితులను ఆయనకు వివరిస్తామని జగన్ చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
జగన్ ఈ ప్రకటన ఫై హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరిగాయని చెప్తున్న రాజకీయ హత్యల వివరాలు ఇవ్వాలని జగన్ కు సూచించారు. జగన్ మాత్రం 36 రాజకీయ హత్యలు జరిగాయని ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు. అదే నిజమైతే జగన్ ప్రభుత్వానికి ఆయా హత్యల వివరాలు ఇవ్వాలన్నారు. ఈ వివరాలు ఇవ్వలేకపోతే ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని వంగలపూడి అనిత ప్రశ్నించారు. రాష్ట్రంలో కేవలం నాలుగు రాజకీయ హత్యలు మాత్రమే జరిగాయని, వీటిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలే చనిపోయారని అనిత వెల్లడించారు. అసెంబ్లీకి వస్తే తన బాగోతాలు బయటపడతాయని డైవర్షన్ పాలిటిక్స్ను జగన్ ఎంచుకున్నాడని అనిత దుయ్యబట్టారు. ఈ నెల 24న అసెంబ్లీలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం పెట్టి ప్రభుత్వం చర్చ చేపడుతోందన్న అనిత, ఆరోజు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని ఆయనకు సవాల్ విసిరారు. ఢిల్లీ వెళ్లాలనుకుంటే అసెంబ్లీలో చర్చ తర్వాత కూడా వెళ్లొచ్చిన హితవు పలికారు.
రాష్ట్రంలో విష సంస్కృతి నాటి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసినందుకే ప్రజలు 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టారని గుర్తు చేశారు. జగన్ పాలనలో మహిళలు, బాలికలపై నేరాలు రెట్టింపు అయ్యాయని జాతీయ నివేదికలు బయటపెట్టాయని వివరించారు. చిన్నపిల్లలపై ఎక్కడైనా అఘాయిత్యాలు జరుగుతుంటే తన కంటే ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తున్నారన్న అనిత, గత 5 ఏళ్లలో శాంతి భద్రతలపై ఒక్క సమీక్ష అయినా జగన్ చేశాడా అని నిలదీశారు.
సీఎం పదవి కోసం తండ్రి చావుని, సొంత బాబాయ్ని హత్య చేయించి, కోడి కత్తి శ్రీనుని బలి చేసి, గులకరాయి డ్రామాలాడిన రాక్షసుడు జగన్ కాదా అని అనిత ప్రశ్నించారు. నిన్నటి వరకూ పరదాలు కట్టడానికి, బారికేడ్లు పెట్టడానికే పరిమితమైన పోలీసులు, చంద్రబాబు పాలనలో తప్పు చేసిన వారి తాట తీసేందుకు సిద్ధమవుతున్నారని హెచ్చరికలు పంపారు.
Read Also : YCP : వైజాగ్ లో వైసీపీకి బిగ్ షాక్ ..సైకిల్ ఎక్కిన కార్పొరేటర్లు