TDP 40 Years : టీడీపీ ఆవిర్భానికి 40ఏళ్లు.!
యుగపురుషుడు ఎన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆనాడు పార్టీని ప్రకటించాడు.
- By CS Rao Published Date - 04:06 PM, Mon - 28 March 22
యుగపురుషుడు ఎన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆనాడు పార్టీని ప్రకటించాడు. `సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు` నినాదంతో నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్లు అయింది. కూడు, గూడు, గుడ్డ నినాదంతో టీడీపీ స్థాపన జరిగింది. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ప్రస్థానంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేక లోగోను ఆవిష్కరించాడు. టీడీపీ 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చాడు. పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలని దిశానిర్దేశం చేశాడు.
1983 వరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా కాంగ్రెస్ పాలిస్తోన్న రోజులవి. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఒక రాజకీయ పార్టీ ఉండాలని భావించిన ఎన్టీఆర్ 1982 మార్చి 29న పార్టీని స్థాపించాడు. ఆ తరువాత సన్యాసము పుచ్చుకొని వేషం మార్చేశాడు. తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే జీవితము అంకితమని ప్రతినబూనాడు. చైతన్య రధంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించాడు. అప్పటికే సినిమా రంగంలో సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. తెలుగువారి “ఆత్మగౌరవ” నినాదంతో పార్టీ 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సినిమావాళ్ళకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని “ఇందిరా గాంధీ” హేళనకు ఎన్టీఆర్ గట్టి జవాబు ఇచ్చాడు. అంతే కాదు, అప్పట్లో ఉన్న 42 లోక్సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని ప్రత్యర్థులను టీడీపీ మట్టికరిపించింది. ఆ సంవత్సరం దేశం మొత్తం మీద 544 లోక్సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం రికార్ట్ లను బద్దలు కొట్టింది. తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తొలి రోజుల్లోనే కిలోబియ్యం రెండు రూపాయల పధకాన్ని అమలు పరిచింది.
వ్యక్తిత్వరీత్యా ఆవేశపరుడిగా కనిపించినా, పేద ప్రజల గుండెలలో ఛిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు రామారావు. ముఖ్యంగా “మదరాసీ”లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన ధీశాలి, తెలుగుతల్లి ముద్దుబిడ్డ, నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, “ఒక్క రూపాయి” మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించాడు. అది కేవలం ఎన్.టి.ఆర్.కు మాత్రమే చెల్లింది. నాదెండ్ల భాస్కరరావు 1983 ఆగస్టులో దొడ్డి దారిన ఎన్టీఆర్ పదవిని ఇందిరాగాంధీ సాయంతో లాక్కున్నాడు.ఆరోగ్య కారణలతో అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఎమ్మెల్యే లతో ఢిల్లీలో నిరసన పేరెడ్ నిర్వహించడం ద్వారా ఇందిర సర్కార్ ను గడగడలాడించాడు.అనివార్యంగా ఇందిరాగాంధీ తిరిగి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. 1984లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200 పైగా అసెంబ్లీ సీట్లు సాధించి రెండవ సారి ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశాడు. 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఎన్టీఆర్ తిరిగి సినిమాల వైపు మొగ్గుచూపుతూ రాజకీయాలను నడిపాడు.1989, 1994ల మధ్యకాలంలో, ఎన్.టి.రామారావు కొనసాగించిన సన్యాసాన్ని విడిచిపెట్టి లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నాడు. దేశం లోని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలని చిన్న చిన్న జాతీయ పార్టీలను ఒక తాటి పైకి తెచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా “నేషనల్ ఫ్రంట్” కూటమిని స్థాపించి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వి.పి.సింగ్ ని ప్రధానిని చేశారు “నేషనల్ ఫ్రంట్”కు చైర్మెన్ గా వ్యవహరించాడు.
1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు మూడవ సారి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. రామారావు భార్య పాలనా వ్యవహారాలలో రాజ్యాంగేతర శక్తిగా కలుగజేసుకుంటున్నదనే ఆరోపణలతో 1995లో, అప్పటి రెవిన్యూ మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అత్యధికమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకి మద్దతు ప్రకటించడంతో, ఎన్.టి.రామారావు అధికారం కోల్పోవలసి వచ్చింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే చరిత్ర సృష్టించింది. 1982 మార్చి 29న స్థాపించిన టీడీపీ 1983 జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలను తొలిసారిగా ఫేస్ చేసింది. ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలోని 294 స్థానాలకుగానూ 203స్థానాలు సాధించింది. ఆంధ్రప్రదేశ్లో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు కొత్త చరిత్రకు నాంది పలికాడు. మొత్తం 9సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్న టీడీపీ 5 సార్లు అధికారంలోకి వచ్చి, 21 ఏళ్లు అధికారంలో ఉండడం ప్రాంతీయ పార్టీగా రికార్ట్ నమోదు చేసింది.
1985లో 35 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుని లోక్ సభలో ప్రతిపక్ష హోదాని దక్కించుకుని జాతీయ స్థాయిలో రికార్ట్ సృష్టించింది. కాంగ్రెసేతర పార్టీలను ఎన్టీఆర్ కూడగట్టి నేషనల్ ఫ్రంట్ను ఏర్పాటుచేసి ఛైర్మన్గా ఎన్నిక అయ్యాడు.
ఆవిర్భావం నాటి నుంచి ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగిన చరిత్ర ఎక్కువే. 1983 ఎన్నికల్లో మేనకా గాంధీ నాయకత్వంలోని సంజయ్ విచార్ మంచ్తో జత కట్టింది. ఆ ఎన్నికల్లో సంజయ్ విచార్ మంచ్కి ఎన్టీఆర్ ఐదు స్థానాలను కేటాయించాడు. తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో 201 స్థానాలను గెలుచుకుంది. ఇందిరాగాంధీ హత్య తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, వామపక్షాలు కలిసి ఎన్నికల బరిలో దిగాయి. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతి వ్యక్తమైంది. కానీ, ఏపీలో మాత్రం టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీకి దేశం మొత్తం మీద రెండు సీట్లు దక్కితే, అందులో హన్మకొండ ఒకటి కావడం గమనార్హం. లోక్సభలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.1989 ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీ, వామపక్షాలు పొత్తు పెట్టుకున్నాయి. కానీ టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. 1994లో వామపక్షాలతో మాత్రమే కలిసి టీడీపీ పోటీ చేసింది. 216 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ సీఎం అయ్యాడు. ఆ తరువాత లక్ష్మీపార్వతి రూపంలో ఎన్టీఆర్ కు పదవీ గండం ఏర్పడింది. అధికార మార్పిడి జరగడంతో 1995లో ఎన్టీఆర్ ను దించేసి చంద్రబాబు సీఎం అయ్యాడు. 1996 లో లోక్సభ మధ్యంతర ఎన్నికలు బాబు నాయకత్వంలోని టీడీపీ లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసింది. కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం ఏర్పాటైంది. 1999లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. చంద్రబాబు రెండోసారి సీఎం అయ్యాడు. 2004లో మరోసారి టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఘోరంగా ఓడిపోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల తర్వాత బీజేపీకి టీడీపీ దూరమైంది. 2009లో టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి మహాకూటమిగా టీడీపీ పోటీ చేసింది. కానీ, కూటమి ఓడిపోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసింది. జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీకి దిగకున్నా.. టీడీపీ-బీజేపీ కూటమికి సపోర్ట్ చేసింది. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగా.. ఏపీలో టీడీపీ-బీజేపీ, జనసేన కూటమి గెలుపొందింది. చంద్రబాబు సీఎం అయ్యాడు.ఓటుకు నోటు కేసు తరువాత 2018 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జతకట్టింది. కానీ, టీడీపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది.జాతీయ స్థాయిలో లోక్సభలో ప్రతిపక్షంగా ఉన్న మొదటి ప్రాంతీయ పార్టీగా చరిత్రలో నిలిచిన టీడీపీ తెలంగాణ ప్రాంతంలో ఉనికి కోల్పోయింది. 1984 లోక్సభ ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లు గెలవడంతో లోక్సభలో ప్రతిపక్షంగా నిలబడినప్పటికీ 1989 లోక్సభ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే టీడీపీ పరిమితం అయింది.జాతీయ రాజకీయాల్లో టీడీపీ తనదైన ముద్ర వేసింది. 1989లో నేషనల్ ఫ్రంట్ తరపున వీపీ సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో, 1996లో యునైటెడ్ ఫ్రంట్ తరపున దేవెగౌడ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో, తరువాత ఎన్డీఏలో కీలక పాత్ర పోషించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీయార్ మొత్తం మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా రెండుసార్లు, పదవి మార్పిడి ద్వారా ఒకసారి మొత్తం మూడుసార్లు ముఖ్యమంత్రి కాగలిగాడు.1985లో కాంగ్రెస్ సహకారంతో నాదెండ్ల భాస్కర రావు తిరుగుబాటును టీడీపీ సమర్థంగా తిప్పికొట్టగలిగింది. 1995లో చంద్రబాబు నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు ఎన్టీయార్ను ఆ పార్టీ నుంచి బయటకు గెంటేసింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ కోసం కూడా చంద్రబాబు, ఎన్టీఆర్ మధ్య న్యాయపోరాటం జరిగింది. చివరకు జయప్రదంగా చంద్రబాబు కు అనుకూలంగా సైకిల్ గుర్తు కేటాయిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. “ఎన్టీయార్లో నైతిక విలువలు శూన్యం” అంటూ అప్పట్లో ఇండియా టుడే వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు ఆరోపించారు. కానీ, ఆ తరువాత “ఎన్టీయార్ దైవాంశ సంభూతుడు” అంటూ ఆయనే వివిధ బహిరంగ సభల్లో స్తుతించారు. ఎన్టీయార్ పేరిట అనేక పథకాలూ ప్రవేశపెట్టడం గమనార్హం.
చంద్రబాబు హయాంలో తెలుగుదేశం కొత్తగా ఎదిగింది. దేశంలోని అత్యంత వ్యవస్థీకృతమైన పార్టీల్లో ఒకటిగా తెలుగుదేశం గుర్తింపు తెచ్చుకుంది. కార్యకర్తల సమగ్ర సమాచారం నిర్వహించడం దగ్గర నుంచి ప్రతీదీ పక్కాగా ఉంటుంది. ఎన్నికల నిర్వహణలో ధన బలం పెరగడానికి టీడీపీ కారణమనే విమర్శలు కూడా ఆ పార్టీ తరచూ ఎదుర్కొంటుంది. చంద్రబాబు హయాంలో బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అనే పదం చాలా పేరు సంపాదించింది.తెలుగుదేశానికి మొదటి భారీ ఓటమి 2004లో వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 47 సీట్లతో టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చరిత్రలో టీడీపీ తొలిసారిగా ఒంటరిగా 2019 ఎన్నికల్లో బరిలోకి దిగి వైసీపీ ప్రభంజనంలో కేవలం 23 స్థానాలకే పరిమితం అయింది.తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఆ పార్టీ నుంచి గెలిచిన వారినందరినీ తనవైపుకు లాక్కున్నారు కేసీఆర్. నాయకులే కాదు, టీడీపీ కార్యకర్తలు కూడా అదే స్థాయిలో టీఆర్ఎస్ వైపు వెళ్ళారు. ఉమ్మడి ఏపీలోని పార్టీని, కేవలం ఆంధ్రా పార్టీగా చూపించడంలో కేసీఆర్ సఫలం అయ్యాడు. తెలుగుదేశం ప్రస్తుతం జాతీయ పార్టీగా చెప్పుకుంటుంది. కానీ 2018 ఎన్నికల తరువాత తెలంగాణలో టీడీపీ గుర్తింపు పొందిన పార్టీ హోదా కూడా కోల్పోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్లీ తన పాత వైభవం కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు వయసుతో సంబంధం లేకుండా కష్టపడటానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు.కుమారుడు లోకేశ్కు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న చంద్రబాబు కల తాత్కాలికంగా వాయిదా పడవచ్చు. లోకేశ్ అసలు వ్యక్తిత్త్వం ఎలా ఉన్నా ప్రజల్లో మాత్రం ఇమేజ్ క్రియేట్ కాలేదు. ఇప్పుడు తెలుగుదేశం మళ్ళీ పాత వైభవాన్ని సంపాదించడానికి ఏం చేస్తుంది? ఎవరి నాయకత్వంలో ముందుకు వెళుతుంది అనేది పెద్ద ప్రశ్న.
Related News
Somireddy Chandramohan Reddy : 135 ఎమ్మెల్యే సీట్లతో ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది టీడీపీ, జనసేన, బీజేపీ అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.