AP Liquor scam Case : ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి అరెస్ట్
AP Liquor scam Case : ఈరోజు ఉదయం నుంచి తొమ్మిది గంటలపాటు జరిగిన విచారణ అనంతరం ఈ చర్య తీసుకున్నారు. వీరిద్దరూ కేసులో ఏ31, ఏ32 నిందితులుగా నమోదు కాగా, మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.
- Author : Sudheer
Date : 16-05-2025 - 9:37 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో ఎట్టకేలకు కీలక అభియోగాలు ఎదుర్కొంటున్న ఇద్దరు ప్రముఖులను సిట్ (Special Investigation Team) అధికారులు అరెస్ట్ చేశారు. మాజీ సీఎంవో కార్యదర్శి ధనుంజయ్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ఓఎస్డీ (OSD) కృష్ణమోహన్రెడ్డిని మూడు రోజులపాటు విచారించిన తర్వాత శుక్రవారం అధికారికంగా అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం నుంచి తొమ్మిది గంటలపాటు జరిగిన విచారణ అనంతరం ఈ చర్య తీసుకున్నారు. వీరిద్దరూ కేసులో ఏ31, ఏ32 నిందితులుగా నమోదు కాగా, మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.
Turkish Aviation Celebi: సెలెబీ ఏవియేషన్ హోల్డింగ్ అంటే ఏమిటి? ఎవరు ప్రారంభించారు?
సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు మే 16 వరకు వారిపై చర్యలు తీసుకోవద్దని సూచించినప్పటికీ, విచారణకు మాత్రం హాజరుకావాలని స్పష్టంగా పేర్కొంది. అదే నేపథ్యంలో వీరు విజయవాడలోని సిట్ కార్యాలయానికి హాజరై విచారణకు సహకరించారు. లిక్కర్ స్కాం పేరుతో వెలుగులోకి వచ్చిన వేల కోట్ల రూపాయల కుంభకోణంలో ఇప్పటికే గోవిందప్ప బాలాజీ అనే మరొక కీలక నిందితుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను ఏ33వ నిందితుడిగా కేసులో చేర్చారు. ప్రస్తుతం అరెస్టయిన ధనుంజయ్, కృష్ణమోహన్లకు సంబంధించి కొత్త ఆధారాలతో విచారణ మరింత వేగం తీసుకుంటుంది.
గతంలో ఈ ఇద్దరూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు నిరాకరించింది. అనంతరం వారు సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ, జస్టిస్ పార్థీవాలా ధర్మాసనం కూడా ఈ దశలో ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. విచారణ అధికారుల చేతులను కట్టేసే విధంగా అవుతుందని పేర్కొంటూ, రెగ్యులర్ బెయిల్కు అప్లై చేయాలని సూచించింది. ప్రస్తుతం సిట్ అధికారులు అరెస్ట్ అనంతరం తదుపరి విచారణ కోసం న్యాయ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ కేసులో రోజుకో కొత్త మలుపు తలెత్తుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది.