Chandrababu : శ్రీ రామానుజార్ దేవాలయాన్ని సందర్శించిన చంద్రబాబు
- By Sudheer Published Date - 11:42 AM, Wed - 13 December 23

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) నేడు బుధువారం తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్ (Sriperumbudur )లోని శ్రీరామానుజర్ దేవాలయాన్ని (Sri Ramanujar Temple) సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టం అని చంద్రబాబు అన్నారు. ఏపీ, తెలుగువారి కోసం తాను అంకితభావంతో పనిచేస్తానని.. అందరికీ మంచి జరగాలని తాను ప్రార్ధించినట్లు తెలిపారు. తమిళనాడులో తనకు లభించిన ఘన స్వాగతంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. తాను కష్టంలో ఉన్న సమయంలో ప్రజలు ఇచ్చిన మద్దతు మరిచిపోలేను అన్నారు. ధర్మాన్ని రక్షించుకునేందుకు.. తెలుగు జాతి కోసం ముందుండి పనిచేస్తానన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటీవల తనకు ఎదురైన ఇబ్బందులు దూరమవ్వాలని కోరుకున్నానని పేర్కొన్నారు. తాను ఆంధ్రప్రదేశ్కు చేసిన మేలును ప్రజలు గుర్తుచేసుకుని సహకరించే పరిస్థితికి వచ్చారని, ఇది తనకు కొత్త అనుభూతినిస్తోందని వివరించారు. మంచి చేస్తే ప్రజలు ఎప్పుడూ తోడుంటారనేది మరోసారి రుజువైందని అన్నారు. ఏపీలో ధర్మాన్ని పరిరక్షించాల్సిన అవసరముందన్నారు. దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ను మంచి స్థితిలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు తనపై ఉందని చెప్పారు. ఆ బాధ్యతను నెరవేర్చేందుకు పునరంకితమవుతానని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు మార్పు తేవాలనే విషయంలో స్పష్టతతో ఉన్నారని.. 5ఏళ్ల పాటు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అందరి సహకారంలో రాష్ట్రాన్ని కాపాడుకుంటామన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
Read Also : Dharani Portal : ధరణి ఫై సీఎం రేవంత్ ఏ నిర్ణయం తీసుకుంటారో..?