Chandrababu Naidu: జనంలోకి చంద్రబాబు, ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటన!
ఈనెల 10 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
- Author : Balu J
Date : 02-12-2023 - 12:01 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu Naidu: స్కిల్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న చంద్రబాబు దాదాపు 52 రోజులపైగా జైల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన సభలు, సమావేశాలకు బ్రేక్ పడినట్టు అయ్యింది. అయితే ఇటీవలనే టీడీపీ అధినేతకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపినట్టయింది. ఈ నేపథ్యంలో ఈనెల 10 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం, సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేయడంపై రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ఏపీ పంచాయతీరాజ్ చాంబర్, ఏపీ సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు.
ఈ సమావేశాలు ఈనెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడప జిల్లాల్లో జరగనున్నాయి. పార్టీలకు అతీతంగా సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను సమావేశాలకు ఆహ్వానించనున్నారు. చంద్రబాబు మళ్లీ జనంలోకి వస్తుండటంతో అటు అభిమానులు, ఇటు టీడీపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Hyderabad: హైదరాబాద్ లో వాయు కాలుష్యం, సిటీజనం ఉక్కిరిబిక్కిరి