Botsa Anusha : వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న బొత్స అనూష
2024 ఎన్నికల తర్వాత మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా, బొత్స తన కుమార్తె బొత్స అనూషను నేరుగా రంగంలోకి దించడం నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది
- Author : Sudheer
Date : 09-01-2026 - 8:24 IST
Published By : Hashtagu Telugu Desk
- నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతున్న బొత్స అనూష
- తండ్రి అడుగుజాడల్లో కూతురు
- చీపురుపల్లిలో వైసీపీ కి కొత్త పవర్
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన అగ్రనేత బొత్స సత్యనారాయణ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రాష్ట్ర స్థాయి బాధ్యతలకే పరిమితం కాకుండా, తన సొంత నియోజకవర్గం చీపురుపల్లిపై పట్టు కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు. గత రెండు దశాబ్దాలుగా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో, క్యాబినెట్ పదవుల్లో బిజీగా ఉండటంతో, నియోజకవర్గ బాధ్యతలను తన మేనల్లుడు చిన్న శ్రీనుకు అప్పగించారు. బొత్స నీడలో ఎదిగిన చిన్న శ్రీను, వైసీపీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తూ నియోజకవర్గంలో బలమైన అనుచరగణాన్ని ఏర్పరచుకున్నారు. అయితే 2024 ఎన్నికల తర్వాత మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా, బొత్స తన కుమార్తె బొత్స అనూషను నేరుగా రంగంలోకి దించడం నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

Satyanarayana Daughter Anusha
ప్రస్తుతం బొత్స సత్యనారాయణ శాసనమండలి ప్రతిపక్ష నేతగా రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండటం, మరోవైపు చిన్న శ్రీను భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టి అక్కడ పార్టీ బలోపేతంపై దృష్టి సారించడంతో, చీపురుపల్లిలో నాయకత్వ ఖాళీ ఏర్పడింది. ఈ క్రమంలో తండ్రి ఆదేశాలతో అనూష నియోజకవర్గ బాధ్యతలను తన భుజానికెత్తుకున్నారు. గరివిడిలోని క్యాంప్ కార్యాలయం వేదికగా ఆమె నిర్వహిస్తున్న సమీక్షలు, మండల స్థాయి నేతలు మరియు కార్యకర్తలతో నేరుగా జరుపుతున్న సంప్రదింపులు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తండ్రికి తగ్గ తనయగా, నియోజకవర్గ సమస్యలపై పట్టు సాధిస్తూ, ప్రజలకు మరియు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం ఆమె శైలిగా కనిపిస్తోంది.
అనూష రాకతో చీపురుపల్లి వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో చిన్న శ్రీను వెన్నంటి నడిచిన ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇప్పుడు అనూష నాయకత్వాన్ని ఆమోదిస్తూ ఆమెతో కలిసి నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పిలుపునిచ్చే నిరసన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేస్తూ ఆమె తన కార్యదక్షతను నిరూపించుకుంటున్నారు. చిన్న శ్రీను భీమిలికి పరిమితం కావడం, అనూష చీపురుపల్లిలో పూర్తిస్థాయిలో యాక్టివ్ అవ్వడంతో, రాబోయే రోజుల్లో బొత్స సత్యనారాయణ రాజకీయ వారసురాలిగా ఆమె నియోజకవర్గంలో మరింత కీలకం కానున్నారని స్పష్టమవుతోంది.