Gold Coins Gang : ఫేక్ గోల్డ్ కాయిన్స్ గ్యాంగ్.. బండారం బట్టబయలు
Gold Coins Gang : గుంటూరులో ఫేక్ గోల్డ్ కాయిన్స్ గ్యాంగ్ మోసానికి పాల్పడింది.
- Author : Pasha
Date : 09-10-2023 - 10:47 IST
Published By : Hashtagu Telugu Desk
Gold Coins Gang : గుంటూరులో ఫేక్ గోల్డ్ కాయిన్స్ గ్యాంగ్ మోసానికి పాల్పడింది. నగరంలోని ఏటీ అగ్రహారానికి వెంకటేశు.. అదే ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంకటరెడ్డి, కొండలును సెప్టెంబరు 17న కలిశాడు. ‘‘నా దగ్గర బంగారు నాణేలు ఉన్నాయి. వాటిని నేను బళ్లారికి చెందిన ఓ రైతు నుంచి తక్కువ రేటుకే కొన్నాను. ఆ రైతు పొలంలో ఇంకా చాలా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. వాటిని తక్కువ ధరకే ఇస్తాను’’ అని నమ్మబలికాడు. అంతేకాదు.. వెంకటేశు తన దగ్గరున్న రెండు గోల్డ్ కాయిన్స్ ను శాంపిల్ గా వెంకటరెడ్డి, కొండలుకు చూపించాడు. వాటిని వారిద్దరు పట్నంబజార్లోని ఓ బంగారు షాపునకు తీసుకెళ్లి చెక్ చేయించగా, అవి బంగారు కాయిన్సే అని తేలింది.
We’re now on WhatsApp. Click to Join
కేజీ బంగారు నాణేలు.. రూ.10 లక్షలు కావాలని..
తమ దగ్గర కేజీ బంగారు నాణేలు ఉన్నాయని వాటికి రూ.10 లక్షలు కావాలని వెంకటేశుతో ఉన్న ముఠా నమ్మబలికింది. రూ.5 లక్షలు ఇస్తామని.. ఆ నాణేలు మొత్తం ఇచ్చేయాలని వెంకటరెడ్డి, కొండలు అన్నారు.బళ్లారిలో పొలం దున్నిఅయితే ఆ గోల్డ్ కాయిన్స్ ను బయటకు తీయాల్సి ఉందని వెంకటేశుతో పాటు ఉన్న గోల్డ్ కాయిన్స్ ముఠా సభ్యులు చెప్పారు. తమతో పాటు వస్తే.. ఆ రైతు దగ్గరకు తీసుకెళ్తామన్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంకటరెడ్డి, కొండలు.. ఈ ముఠా సభ్యులతో కలిసి గుంటూరు నుంచి బళ్లారి రైల్వేస్టేషన్కు వెళ్లారు. అక్కడి రైల్వే స్టేషన్లో ఆ వ్యాపారుల్ని వెయిట్ చేయాలని వెంకటేశు కోరాడు. గుంటూరు నుంచి వారితో కలిసి వెళ్లిన ముగ్గురు సభ్యులు రైతును తీసుకొస్తామని చెప్పి స్టేషన్ నుంచి బయటకు వెళ్లారు. గంటన్నర తర్వాత రైతు వేషంలో ఓ వృద్ధుడ్ని తీసుకొచ్చి.. వెంకటరెడ్డి, కొండలుకు పరిచయం చేశారు. వృద్ధుడు వచ్చి తన దగ్గరున్న రెండు బంగారు నాణేలతో కూడిన మూటలు వాళ్ల ముందు పెట్టి తీసుకెళ్లాలని కోరాడు. ఆ నాణేలను గుంటూరులో తప్ప ఎక్కడా చూడొద్దని కండీషన్ పెట్టాడు.
Also read : KCR Health Belletin: కేసీఆర్ ఆరోగ్యంపై గోప్యత ఎందుకు? గత ముఖ్యమంత్రుల పరిస్థితేంటి?
గుంటూరులో రైలు నుంచి దిగిన వెంటనే..
వెంకటరెడ్డి, కొండలు గుంటూరులో రైలు నుంచి దిగిన వెంటనే ఆ రెండు సంచులు వారికి ఇచ్చి వెంకటేశు అండ్ ముఠా సభ్యులు వెళ్లిపోయారు. నాణేల సంచులు తీసుకుని ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు బంగారం షాపులో చెక్ చేయించగా అవి ఇత్తడివని తేలింది. దీంతో మోసపోయామని భావించి.. వెంకటేశు ఇంటి దగ్గరకు వెళ్లారు.‘‘మాకు ఇత్తడి నాణేలు ఇచ్చి బంగారు నాణేలు అని చెబుతారా ? మేం ఇచ్చిన రూ.5 లక్షలు మర్యాదగా వెనక్కు ఇస్తే ఓకే.. లేదంటే పోలీసులకు పట్టిస్తాం’’ అని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంకటరెడ్డి, కొండలు వార్నింగ్ ఇచ్చారు. అయినా వెంకటేశు భయపడలేదు. చివరకు నగరపాలెం పోలీసులు కేసు (Gold Coins Gang) నమోదు చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని ఫేక్ గోల్డ్ కాయిన్స్ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.