AP DSC 2024 : ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు.. అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే
- Author : Latha Suma
Date : 21-02-2024 - 12:39 IST
Published By : Hashtagu Telugu Desk
AP DSC 2024 : ఆంధ్రప్రదేశ్లో సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT) పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థుల అనుమతికి సంబంధించి ఏపీ హైకోర్టు(ap high court) స్టే విధించింది. అయితే.. ఆ అభ్యర్థులను అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అనుమతించడంపై ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అద్దంకి వాసి బొల్లా సురేష్.. మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.
We’re now on WhatsApp. Click to Join.
ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను అనుమతించటం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కోర్టుకు తెలిపారు. ఎన్సీఈటీ నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టిందన్నారు. దీనిపై తొలుత మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. బుధవారం (ఫిబ్రవరి 21)కి వాయిదా వేసింది. అయితే.. ఈ రోజు బీఈడీ అభ్యర్థులను అనుమతించే రూల్పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.
read also : Shreyas Iyer: కేకేఆర్కు బిగ్ షాక్ తగలనుందా..? అయ్యర్ ఈ సీజన్ కూడా కష్టమేనా..?
కాగా, నిన్న (మంగళవారం) జరిగిన విచారణలో హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని ప్రాథమికంగా తప్పుపట్టింది. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని పేర్కొంది. విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకొనేది లేదని తేల్చిచెప్పింది. ఒకానొక దశలో ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది.