Pawan Kalyan: సినిమా థియేటర్లో లైవ్.. ప్రజలతో పవన్ వర్చువల్ ముఖాముఖి
ఈసందర్భంగా ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను పవన్ (Pawan Kalyan) అడిగి తెలుసుకున్నారు.
- By Pasha Published Date - 11:03 AM, Thu - 22 May 25

Pawan Kalyan: సినిమా థియేటర్లో సినిమాలనే చూపిస్తారు. అయితే థియేటర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో పవన్ మాట్లాడారు. ‘మన ఊరు-మాటా మంతి’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని టెక్కలిలోని భవానీ థియేటర్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రజలు థియేటర్లో కూర్చొని పవన్కల్యాణ్తో ఇంటరాక్ట్ అయ్యారు.
Also Read :Donald Trump Jr: రిపబ్లికన్ పార్టీ పిలుస్తోంది.. నేనూ అధ్యక్షుడిని అవుతా : ట్రంప్ కుమారుడు
అభివృద్ధి పనులపై సమీక్ష
ఈసందర్భంగా ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను పవన్ (Pawan Kalyan) అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.రావివలస రహదారిని రూ.3 కోట్లతో అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. రావివలస, దామోదరపురం శ్మశానవాటికలకు రూ.1.20 కోట్లతో సీసీ రహదారులు ఏర్పాటు చేస్తామన్నారు. పంచాయతీలో 2.97 కి.మీ రహదారులకు మరో రూ.5.21 కోట్ల మంజూరుకు ఆయన హామీ ఇచ్చారు.
Also Read :Bangladesh Army Coup: భారత్ మిత్రదేశంలో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్.. సైనిక తిరుగుబాటు తప్పదా ?
ఈనెల 26న చెన్నైలో పవన్ కల్యాణ్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈనెల 26న చెన్నైలో పర్యటించనున్నారు. తిరువాన్మియూరులో ఉన్న రామచంద్ర కన్వెన్షన్ హాలులో ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అనే అంశంపై జరిగే సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాతీయ కన్వీనర్ అనిల్ కె.ఆంటొని, రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కో-కన్వీనర్లు ఆర్.అర్జునమూర్తి, నారాయణన్ తిరుపతి తదితరులు పాల్గొంటారు. ఇటీవలే తమిళ భాషలోని ఒక శ్లోకాన్ని ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ ఒక ట్వీట్ చేశారు. గతంలో దక్షిణాది రాష్ట్రాల్లోని ఆలయాలను ఆయన సందర్శించారు. మొత్తం మీద సౌతిండియాలో తన రీచబులిటీని పవన్ క్రమంగా పెంచుకుంటున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో పవన్ కల్యాణ్తో ప్రచారం చేయించుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకోసం ఇప్పటినుంచే ఆయనను తమిళ ప్రజలకు చేరువ చేస్తోంది. అందులో భాగంగానే ఈ పర్యటనలన్నీ జరుగుతున్నట్లు తెలుస్తోంది.