AP Assembly : మెగా డీఎస్సీ పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
AP Assembly : 16,384 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు
- By Sudheer Published Date - 06:08 PM, Tue - 25 February 25

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu ) అసెంబ్లీ (AP Assembly) వేదికగా పలు కీలక ప్రకటనలు (Several Key Announcements) చేశారు. ముఖ్యంగా మెగా డీఎస్సీ, అన్నదాత సుఖీభవ (Mega DSC, Annadata Sukhibhav) పథకాలపై స్పష్టతనిచ్చారు. 16,384 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. నియామక ప్రక్రియ పూర్తి చేసి, ఉపాధ్యాయులకు తగిన ట్రైనింగ్ ఇచ్చి, పాఠశాలలను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామని మరోసారి నొక్కి చెప్పారు.
అన్నదాత సుఖీభవ – రైతులకు భారీ భరోసా
రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్రం నుంచి విడుదల అయ్యే నిధులతో కలిపి ప్రతి రైతుకు రూ. 20,000 మొత్తాన్ని మూడు విడతల్లో అందజేస్తామని ప్రకటించారు. తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు అన్ని విధాలా సహాయంగా ఉండటానికి కృషి చేస్తుందని చెప్పారు.
ఉద్యోగాల కల్పన, అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే రూ. 6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు MOUలు పూర్తయ్యాయని, వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగ అవకాశాలు సిద్ధమవుతాయని అన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ. 3,000 భృతి అందించనున్నట్లు చెప్పారు. 203 అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు భోజనం అందిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.