Nandigam Suresh : నందిగం సురేష్పై మరో క్రిమినల్ కేసు..ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ?
కాకినాడకు చెందిన సీబీఎన్ సీ (CBNC) చర్చి ట్రస్ట్ రెన్యువల్ విషయంలో ఈ వివాదం మొదలైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీగా చక్రం తిప్పిన నందిగం సురేష్కు మంచి పట్టు ఉండటంతో, తమ ట్రస్ట్ సమస్యను పరిష్కరించుకోవడానికి సభ్యులు
- Author : Sudheer
Date : 11-03-2026 - 12:15 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ఆయనపై తాజాగా విజయవాడలో నమోదైన చీటింగ్ కేసు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ట్రస్ట్ రెన్యువల్ పేరిట భారీ వసూళ్లు
కాకినాడకు చెందిన సీబీఎన్ సీ (CBNC) చర్చి ట్రస్ట్ రెన్యువల్ విషయంలో ఈ వివాదం మొదలైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీగా చక్రం తిప్పిన నందిగం సురేష్కు మంచి పట్టు ఉండటంతో, తమ ట్రస్ట్ సమస్యను పరిష్కరించుకోవడానికి సభ్యులు ఆయనను ఆశ్రయించారు. పని పూర్తి చేసి పెడతానని నమ్మబలికిన సురేష్, అందుకు భారీగా ఖర్చు అవుతుందని డిమాండ్ చేశారు. చివరకు రూ. 25 లక్షలకు ఒప్పందం కుదరగా, 2021లో బాధితులు స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి నగదును అందజేశారు. అయితే, ఏళ్లు గడిచినా పని పూర్తి కాకపోగా, డబ్బులు అడిగిన బాధితులను సురేష్ చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
అధికార మార్పిడితో వెలుగులోకి మోసం
గత ప్రభుత్వంలో సురేష్ ఎంపీగా ఉండటంతో, ఆయన పరపతికి భయపడి బాధితులు మౌనంగా ఉండిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశతో బాధితులు విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించారు. తమ దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేయడమే కాకుండా, ప్రాణహాని తలపెడతానని బెదిరించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు, సురేష్పై చీటింగ్ మరియు క్రిమినల్ బెదిరింపుల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఏ క్షణమైనా అరెస్ట్ జరిగే అవకాశం?
తాజాగా నమోదైన ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. గతంలోనే చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసుతో పాటు అమరావతి భూముల వ్యవహారంలో సురేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నేరుగా నగదు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే పక్కా ఆధారాలు సేకరించే పనిలో సూర్యారావుపేట పోలీసులు నిమగ్నమయ్యారు. ఆధారాలు లభ్యమైతే ఆయనను ఏ క్షణమైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మాజీ ఎంపీకి ఈ చీటింగ్ కేసు పెద్ద తలనొప్పిగా మారింది.