Jagan Cabinet: జగన్ కేబినెట్ 3.0 రెడీ.. గ్రాఫ్ కొలమానం..! ఆరుగురు ఔట్..?
జగన్ కేబినెట్ (Jagan Cabinet) 3.0 కు రూపకల్పన చేస్తున్నారు. రెండోసారి మంత్రి వర్గ మార్పు తరువాత కొన్ని రోజులకు
- Author : CS Rao
Date : 18-02-2023 - 10:39 IST
Published By : Hashtagu Telugu Desk
జగన్ కేబినెట్ (Jagan Cabinet) 3.0 కు రూపకల్పన చేస్తున్నారు. రెండోసారి మంత్రి వర్గ మార్పు తరువాత కొన్ని రోజులకు మూడోసారి మార్పు గురించి జగన్ సంకేతాలు ఇచ్చారు. ఆ మేరకు మార్పులు చెయ్యడానికి సిద్ధం అయినట్టు తాడేపల్లి వర్గాల్లోని టాక్. కనీసం ఐదు నుంచి ఏడుగురు మంత్రులను మార్పు చేస్తారని తెలుస్తుంది. ఇటీవల చేసిన సర్వేల్లో 12 మంది మంత్రుల గ్రాఫ్ పడిపోయిందని దాని సారాంశం. ఆ క్రమంలో ఆ 12 మందిని మార్చినా ఆశ్చర్యం లేదని వైసీపీలోని అంతర్గత వర్గాల చర్చ. ఎన్నికల టీమ్ ను ఏర్పాటు చేసుకోవాలని జగన్ యోచిస్తున్నారని తెలుస్తుంది.
డాన్సులతో అదరగొడుతున్న ఇద్దరు మంత్రులకు ఉద్వాసన తప్పదని వాళ్ల స్థానంలో మళ్ళీ మాజీలకు అవకాశం ఉంటుందని టాక్. కొత్తగా ఎంపిక కానున్న ఎమ్మెల్సీలలో ఇద్దరికి అవకాశం వస్తుందని చర్చ జరుగుతుంది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జలను ఈసారి మంత్రివర్గంలోకి తీసుకుంటారని తాడేపల్లి కోటరీలోని చర్చ. ఇప్పటికే చీఫ్ సెక్రెటరీ, డీజీపీ ,సీఎం కడప జిల్లాకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సజ్జలకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇస్తే జగన్ రికార్డ్ రాజకీయాలను నడిపినట్టే. సామాజిక సమీకరణాలు అయిన వారికి ఉండవని రూడీ అవుతుంది.
Also Read: Pathapati Sarraju : క్షత్రియ కార్పోరేషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు మృతి
ఇక కేబినెట్ లో కీలక శాఖ నిర్వహిస్తున్న మహిళా మంత్రికి ఉద్వాసన తప్పదని బలంగా వినిపిస్తుంది. ఆ మహిళా మంత్రి స్థానంలో సుదీర్ఘ కాలం పార్టీ కోసం పని చేస్తూ ఎమ్మెల్సీగా అవకాశం కోసం నిరీక్షిస్తున్న నేతకు ఇప్పుడు కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పిస్తూ ఎమ్మెల్సీ ఖాయం చేయనున్నారు. అదే విధంగా ప్రతిపక్షాల ఆరోపణలకు అవకాశం ఇచ్చిన సీమ జిల్లాలకు చెందిన ఒక మంత్రిని తప్పిస్తారని తెలుస్తోంది. అదే జిల్లా నుంచి సీనియర్ గా ఉన్న ఒక ముఖ్య నేత కేబినెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక, గోదావరి జిల్లాలోని సీనియర్ మంత్రిని వ్యక్తిగత కారణాలతో తప్పిస్తున్నట్లు సమాచారం.
అదే విధంగా అనుభవం, వయసు తక్కువే అయినా మంత్రిగా వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవటంలో వెనుకబడిన మంత్రిని తప్పిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో గోదావరి జిల్లా నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం దక్కనుంది. ఒకే మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కీలక జిల్లాలోనూ ఆయన స్థానంలో సీనియర్ ను కేబినెట్ లోకి తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తం మీద జగన్ కాబినెట్ 3.0 మీద రసవత్తర చర్చ జరుగుతుంది. ప్రస్తుతం 16 మంది ఎమ్మెల్సీ ఎంపిక కూడా కీలకం కానుంది. సమీప భవిష్యతులో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సామాజిక సమీకరణాలకు పెద్ద పీట వేస్తారని సమాచారం. ఈ సారి జగన్ ఇచ్చే ట్విస్ట్ ఎలా ఉంటుందో చూడాలి.