Amaravati Protests: ఢిల్లీకి అమరావతి రైతులు.. డిసెంబర్ 17,18న జంతర్ మంతర్ లో మహాధర్నా..!
- Author : hashtagu
Date : 27-11-2022 - 9:20 IST
Published By : Hashtagu Telugu Desk
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన మూడేళ్లకు చేరుకుంది. ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేపట్టాలని రైతులు నిర్ణయించారు. 2019 డిసెంబర్ లో సీఎం జగన్ రాజధాని వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రకటించడంతో అప్పటి నుంచి రైతులు ఆందోళన చేపట్టారు. కాగా రాజధాని నిర్మాణం గురించి ఎటూ తేలలేదు. అమరావతి రాజధానిని నాశనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని రైతులు ఆరోపిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ధర్నా చేపట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 17,18 తేదీల్లో జంతర్ మంతర్ లో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని రైతులు డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 7వ తారీఖునుంచి పార్లమెంట్ శీతాకాలపు సమావేశాలు ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్నా చేపట్టాలని రైతులు నిర్ణయించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 3 ఏళ్లుగా రైతులు నిరసనలు తెలియజేస్తున్నారు.
డిసెంబర్ 15న విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైల్లో రైతులు ఢిల్లీకి బయలు దేరనున్నారు. 22 బోగీల ప్రత్యేక రైలును ఏర్పాటు చేయనున్నారు. కాగా డిసెంబర్ 19 వ తేదీని భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో రైతు సమస్యలపై నిర్వహించనున్న ర్యాలీలో అమరావతి రైతులు కూడా పాల్గొంటారు. తిరిగి 19వ తారీఖు రాత్రి విజయవాడకు పయణం అవుతారు.