Vidadala Rajini : విడదల రజనిపై ఏసీబీ కేసు నమోదు..?
Vidadala Rajini : మాజీ మంత్రి కావడంతో, ఆమెపై కేసు నమోదు చేయడానికి సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి అవసరం
- By Sudheer Published Date - 11:19 AM, Tue - 4 March 25

చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి విడదల రజని (Vidadala Rajini ) పై అవినీతి ఆరోపణలతో ప్రభుత్వం దర్యాప్తు వేగవంతం చేసింది. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరిస్తోంది. అయితే మాజీ మంత్రి కావడంతో, ఆమెపై కేసు నమోదు చేయడానికి సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి అవసరం. ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి, సంబంధిత ఆధారాలను ACB(అక్రమాస్తుల నిరోధక శాఖ) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)కి సమర్పించింది. ఇప్పుడు గవర్నర్ అనుమతి కోసం కూడా లేఖను రాజ్ భవన్కు పంపినట్లు సమాచారం.
Vijayasai Reddy: విజయసాయి రెడ్డికి త్వరలోనే కీలక పదవి ?
విడదల రజని ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా మంత్రి అయిన తర్వాత మరింత ప్రభావం చూపి నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా స్టోన్ క్రషర్ యజమానుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఒక స్టోన్ క్రషర్ యజమానికి 50 కోట్ల రూపాయల ఫైన్ వేస్తూ 5 కోట్లు చెల్లిస్తేనే వ్యాపారం కొనసాగించేందుకు అనుమతిస్తామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఒత్తిడికి లోనై 2.5 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చినట్లు సమాచారం. ఆమె అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి అనేక అక్రమ లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలింది.
New MLCs : తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల నేపథ్యం ఇదీ..
విజిలెన్స్ మరియు ఏసీబీ నిర్వహించిన దర్యాప్తులో ఆమె అక్రమంగా వసూలు చేసిన సొమ్ము ఎలా వెళ్ళిందనే అంశాన్ని స్పష్టంగా గుర్తించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓడిపోగానే, రజని చేసిన అక్రమాల గురించి బాధితులు పెద్ద ఎత్తున పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో ఏసీబీ పూర్తిస్థాయిలో విచారణ జరిపి, ఆమెపై కేసు నమోదు చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం గవర్నర్ అనుమతి రాగానే, ఆమెపై అధికారికంగా కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. చిలుకలూరిపేట నియోజకవర్గంలో వ్యతిరేకత ఎక్కువ కావడంతో, ఆమెను గుంటూరు నుంచి పోటీ చేయించగా, అక్కడా ఘోర పరాజయం పాలయ్యారు. మళ్లీ చిలుకలూరిపేటకు తిరిగి వచ్చి, టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తూ, రాజకీయంగా వ్యతిరేకత పెంచుకుంటున్నారు. అయితే అధికారంలో ఉన్న సమయంలో చేసిన అక్రమాలకు సంబంధించి కేసులు నమోదవుతున్నందున, రాబోయే రోజుల్లో విడదల రజని రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.