YSR Family Property : వైఎస్సార్ ఫ్యామిలీలో ఆస్తుల వివాదంలో సరికొత్త ట్విస్ట్
వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న వై.ఎస్. విజయమ్మ, తన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కోర్టులో వేసిన పిటిషన్లపై ఘాటుగా స్పందించడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది
- Author : Sudheer
Date : 18-03-2026 - 6:23 IST
Published By : Hashtagu Telugu Desk
వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న వై.ఎస్. విజయమ్మ, తన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కోర్టులో వేసిన పిటిషన్లపై ఘాటుగా స్పందించడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. వైఎస్సార్ కుటుంబంలోని ఆస్తుల పంపకాల వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానాల వేదికగా బహిర్గతమైంది. ముఖ్యంగా సరస్వతి పవర్ వాటాల విషయంలో జగన్ మరియు భారతి అనుసరిస్తున్న తీరును విజయమ్మ తీవ్రంగా తప్పుబట్టారు. 2019లో జరిగిన ఒప్పందం ప్రకారం ఆ వాటాలు షర్మిలకు చెందాల్సి ఉండగా, ఈ లోగా వాటిని తన పేరు మీదకు బదిలీ చేసేందుకు జగన్ దంపతులు అంగీకరించారని ఆమె గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తును సాకుగా చూపి ఆ వాటాల బదిలీని అడ్డుకోవాలని చూడటం వెనుక పెద్ద ‘స్కెచ్’ ఉందని విజయమ్మ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT)కు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.
జగన్ తన పిటిషన్లో పేర్కొన్న అంశాలను విజయమ్మ నేరుగా ప్రశ్నించారు. సండూర్, క్లాసిక్ రియాల్టీ వంటి సంస్థల్లో వాటాల బదలాయింపు జరిగినప్పుడు రాని అభ్యంతరం, కేవలం సరస్వతి పవర్ విషయంలోనే ఎందుకు వస్తోందని ఆమె నిలదీశారు. తాను ఎవరికీ బినామీగానో లేదా ప్రతినిధిగానో వ్యవహరించడం లేదని, స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటున్నానని స్పష్టం చేస్తూ జగన్కు గట్టి చురకలు అంటించారు. తనపై ఉన్న ప్రేమని జగన్ కాదనలేడని చెబుతూనే, చట్టపరంగా తనకు దక్కాల్సిన హక్కులను వదులుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. వాటా సర్టిఫికెట్లు, బదిలీ పత్రాలు స్వయంగా అందజేసిన తర్వాత ఇప్పుడు మాట తప్పడం సరికాదని ఆమె తన కౌంటర్లో వివరించారు.
మరోవైపు వైఎస్ షర్మిల కూడా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, ఈ వివాదానికి జగన్ రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు. తండ్రి వైఎస్సార్ ఆశయాలకు విరుద్ధంగా కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒప్పందాలను వివాదాస్పదం చేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్షల కోసమే తన పేరును ఈ ఆస్తి తగాదాల్లోకి లాగి ఇబ్బంది పెడుతున్నారని షర్మిల పేర్కొన్నారు. ఏప్రిల్ 29న ఈ కేసు తదుపరి విచారణకు రానున్న నేపథ్యంలో, విజయమ్మ మరియు షర్మిల దాఖలు చేసిన ఈ బలమైన కౌంటర్లు జగన్ వాదనలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.