Somalia hotel siege: సోమాలియాలో.. 26/11 తరహా టెర్రర్ ఎటాక్.. 21 మంది మృతి, 117 మందికి గాయాలు
26/11 ముంబై ఉగ్రదాడులను మనం ఎప్పటికీ మరచిపోలేం. భారత చరిత్రలోనే అదో చీకటి రోజు. 2008 నవంబరు 26న ఉగ్రవాదులు ముంబైలోని తాజ్ హోటల్లోకి చొరబడి కాల్పులతో విరుచుకుపడ్డారు.
- By Hashtag U Published Date - 02:01 PM, Mon - 22 August 22
26/11 ముంబై ఉగ్రదాడులను మనం ఎప్పటికీ మరచిపోలేం. భారత చరిత్రలోనే అదో చీకటి రోజు. 2008 నవంబరు 26న ఉగ్రవాదులు ముంబైలోని తాజ్ హోటల్లోకి చొరబడి కాల్పులతో విరుచుకుపడ్డారు. అచ్చం ఇలాంటి ఘటనే ఆఫ్రికా దేశం సోమాలియాలో జరిగింది. శుక్రవారం రాత్రి సోమాలియా రాజధాని మోగాదిషులో ఉన్న హయత్ హోటల్ లోకి అల్-షబాబ్ ఉగ్రవాదులు చొరబడి నెత్తుటేరులు పారించారు. హోటల్లో ఉన్న అతిథులపై కాల్పులు జరిపి రక్తపాతం సృష్టించారు. ఉగ్రవాదుల దాడిలో 21 మంది మరణించారు. మరో 117 మందికి పైగా గాయపడ్డారు.శుక్రవారం సాయంత్రం నుంచి సుమారు 30 గంటలపాటు ఉగ్రవాదులతో సోమాలియా దళాలు వీరోచిత పోరాటం చేశాయి. ఉగ్రవాదులను హోటల్ నుంచి పూర్తిగా ఏరిపారేశామని శనివారం అర్ధరాత్రి ప్రకటించాయి. హోటల్ బిల్డింగ్ లో ఇంకా పేలుడు పదార్ధాలు అమర్చబడి ఉంటే, వాటిని తొలగించాల్సి ఉందని తెలిపాయి. సోమాలియా కొత్త అధ్యక్షుడు హసన్ షేక్ మొహముద్ జూన్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొగదిషులో జరిగిన అతిపెద్ద దాడి ఇది.
దాడి చేసింది తామేనన్న అల్-షబాబ్..
ఈ దాడికి అల్ఖైదా అనుబంధ సంస్థ అల్-షాబాద్ ఇస్లామిక్ మిలిటెంట్స్ బాధ్యత వహించింది. ప్రభుత్వ అధికారులు తరచూ సందర్శించే ప్రదేశాలపై దాడులు జరపాలన్నదే తమ లక్ష్యమని తెలిపింది. ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనుబంధ సంస్థలున్నాయి. అందులో అల్-షబాబ్ ఒకటి. ప్రధానంగా సోమాలియాలో ఉన్న ఈ సంస్థ పూర్తి పేరు హర్కత్ అల్-షబాబ్ అల్-ముజాహిదీన్. కెన్యాతో దేశం దక్షిణ సరిహద్దులో ఇది బలమైన ఉనికిని కలిగి ఉంది. అల్-షబాబ్ ఏకైక లక్ష్యం సోమాలి ప్రభుత్వాన్ని పడగొట్టడం. 1991లో సియాద్ బారే నియంతృత్వ పతనంతో సోమాలియా ఏకీకృత దేశంగా మారింది. అంతర్జాతీయ సమాజం ఫెడరల్ ప్రభుత్వాన్ని మాత్రమే చట్టబద్ధమైనదిగా అధికారికంగా గుర్తించింది. అల్-ఖైదా తీవ్రవాద గ్రూపుతో అనుబంధంగా ఉన్న అల్-షబాబ్, సోమాలియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తోంది.
ఖండించిన భారత్..
మొగదిషులోని హయత్ హోటల్పై దాడిని భారత్ కూడా తీవ్ర పదజాలంతో ఖండించింది. బాధిత కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని కూడా తెలియజేసింది. ఉగ్రవాదంపై పోరాటంలో సోమాలియా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని హామీ ఇచ్చింది.”మొగదిషులోని హయత్ హోటల్పై దాడిని భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ పిరికిపంద ఉగ్రవాద చర్యలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తుంది. ఉగ్రవాదంపై పోరాటంలో సోమాలియా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం అండగా నిలుస్తుంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.
అంతర్జాతీయ సమాజం సైతం..
ఈ ఉగ్ర దాడిని యూఎస్ ఎంబసీ ఖండించింది. మొగదిషులోని ప్రముఖ హోటల్పై ఉగ్రవాదుల దాడిని అంతర్జాతీయ సమాజం శనివారం ఖండించింది.
“గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని యూఎన్ కోరుకుంటుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సోమాలిస్ అందరికీ సంఘీభావం తెలియజేస్తుంది” అని సోమాలియాలోని యూఎన్ ప్రతినిధి తెలిపారు. హయత్ హోటల్పై జరిగిన పిరికి దాడిని ఈయూ తీవ్రంగా ఖండించింది. హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని ప్రకటించింది.
Related News
Somalia Hotel Siege : సోమాలియా హోటల్ ముట్టడించిన ఉగ్రవాదులు.. 9 మంది మృతి
Somalia Hotel Siege : సోమాలియా రాజధాని మొగదిషులోని బీచ్సైడ్ హోటల్ "పెరల్ బీచ్" ను ఉగ్రవాదులు 6 గంటల పాటు ముట్టడించిన ఘటనలో 9 మంది మరణించారు.