PM Modi : మూడు దశాబ్దాల తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటన
PM Modi : ఈ పర్యటన ద్వారా రెండు ఖండాల్లోని ఐదు దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలపరిచే లక్ష్యంతో ప్రధానమంత్రి ముందుకు సాగుతున్నారు
- Author : Sudheer
Date : 01-07-2025 - 8:35 IST
Published By : Hashtagu Telugu Desk
భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) జులై 2వ తేదీ నుంచి ఎనిమిది రోజుల పాటు ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటన ద్వారా రెండు ఖండాల్లోని ఐదు దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలపరిచే లక్ష్యంతో ప్రధానమంత్రి ముందుకు సాగుతున్నారు. విదేశాంగ శాఖ ప్రకారం, ఇది దశాబ్దాల తర్వాత భారత ప్రధాని చేసే కీలక పర్యటనగా చెప్పవచ్చు. పర్యటన తొలి దశలో మోదీ జూలై 2, 3 తేదీల్లో ఆఫ్రికా ఖండంలోని ఘనాలో పర్యటించనున్నారు. అక్కడి అధ్యక్షుడితో కలిసి ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించే అంశాలపై చర్చిస్తారు.
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేశ్కు బెయిల్ మంజూరు
జూలై 3, 4 తేదీల్లో ప్రధాని కరేబియన్ ప్రాంతంలోని ట్రినిడాడ్ అండ్ టొబాగోను సందర్శిస్తారు. 1999 తర్వాత ఈ దేశంలో భారత ప్రధానమంత్రి పర్యటించడం ఇదే తొలిసారి. భారత సంతతికి చెందిన వారు అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో, ఈ పర్యటన ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది. అనంతరం జూలై 4, 5 తేదీల్లో ప్రధాని అర్జెంటీనాలో పర్యటిస్తారు. అక్కడి అధ్యక్షుడు జేవియర్ మిలేతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపి, రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడులు వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేస్తారు.
Richest Temples: భారతదేశంలో అత్యంత ధనవంతమైన దేవాలయాలీవే!
జూలై 5 నుంచి 8 వరకు ప్రధాని మోదీ బ్రెజిల్ను సందర్శించి, రియో డి జనీరోలో జరగనున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రపంచ పాలనా సంస్కరణలు, కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలపై కీలకోపన్యాసం చేయనున్నారు. పలుదేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించే అవకాశముంది. చివరగా, జులై 9న నమీబియాకు వెళ్లి ఆ దేశాధికారులతో ద్వైపాక్షిక చర్చలు జరిపి, నమీబియా పార్లమెంట్లో ప్రసంగించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ పర్యటనతో గ్లోబల్ సౌత్ దేశాలతో భారత సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.