Shock To Biden : బైడెన్ కు షాకిచ్చిన జోర్డాన్, ఈజిప్ట్, పాలస్తీనా
Shock To Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు జోర్డాన్, ఈజిప్ట్, పాలస్తీనా షాక్ ఇచ్చాయి.
- By Pasha Published Date - 07:38 AM, Wed - 18 October 23

Shock To Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు జోర్డాన్, ఈజిప్ట్, పాలస్తీనా షాక్ ఇచ్చాయి. ఇవాళ (బుధవారం) నుంచి ఇజ్రాయెల్ పర్యటనను ప్రారంభించనున్న బైడెన్ తో భేటీ అయ్యేది లేదని వెల్లడించాయి. మంగళవారం అర్ధరాత్రి గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన మిస్సైల్ ఎటాక్ లో దాదాపు 700 మంది చనిపోయిన నేపథ్యంలో ఈ మూడు దేశాల అధినేతలు బైడెన్ తో భేటీకి నో చెప్పాయి. దీంతో బైడెన్ కేవలం ఇజ్రాయెల్ లో పర్యటించి.. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు తన సంఘీభావాన్ని ప్రకటించి తిరిగి అమెరికాకు బయలుదేరనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
వాస్తవానికి గాజా యుద్ధాన్ని ఆపే లక్ష్యంతో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, అమెరికా అధ్యక్షుడు బైడెన్ లతో తమ దేశ రాజధాని అమ్మాన్ వేదికగా ఇవాళ సదస్సును నిర్వహించాలని జోర్డాన్ భావించింది. దీనికి హాజరవుతానని బైడెన్ కూడా ప్రకటించారు. అయితే మంగళవారం అర్ధరాత్రి గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన మిస్సైల్ ఎటాక్ లో వందలాది మంది రోగులు చనిపోవడంతో.. జోర్డాన్ లో ఆందోళనలు మిన్నంటాయి. జోర్డాన్ రాజధాని అమ్మాన్ లో అమెరికాకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళితే తమ ఉనికికే ముప్పు వస్తుందని భావించిన జోర్డాన్ రాజు అబ్దుల్లా II.. బైడెన్ ముఖ్య అతిథిగా ఈరోజు నిర్వహించాలని భావించిన సదస్సును రద్దు చేసుకున్నారు. ఈ సమాచారాన్ని అమెరికా కూడా ధ్రువీకరించింది. జోర్డాన్ విదేశాంగ మంత్రి అయ్మన్ సఫాది కూడా దీనిపై ప్రకటన విడుదల చేశారు. మరోవైపు టర్కీలోని నాటో కార్యాలయం దగ్గర కూడా నిరసనలు వెల్లువెత్తాయి. గాజాకు సాయం అందించాలని ప్రజలు టర్కీ ప్రభుత్వాన్ని (Shock To Biden) డిమాండ్ చేశారు.